ఇజ్రాయిల్‌-పాలస్తీనా ఘర్షణ నేర్పుతున్న పాఠం ఏమిటి? – రెండో భాగం

lessons from israel palestine conflicts article arundhanti rai

తమను తాము అత్యంత క్రూరంగా బాధించుకున్న యూదులకు, వారు స్థాన చలనం కలిగించిన వారి నిస్స హాయతను, కోరికను అర్థం చేసుకోవడం నిజానికి అసాధ్యమా? తీవ్రమైన బాధ నిత్యం క్రూరత్వాన్ని ప్రేరేపిస్తుందా? ఇది మానవ జాతికి ఎలాంటి ఆశను కలిగిస్తుంది? విజయం సాధించిన సందర్భంలో పాలస్తీనా ప్రజలకు ఏం జరుగుతుంది? రాజ్యం లేని జాతి చివరకు ఒక రాజ్యాన్ని ప్రకటిస్తే, అది ఎలాంటి రాజ్యం అవుతుంది? దాని జెండా కింద ఎలాంటి భయంకర నేరాలు, ఘోరాలు జరుగుతాయి? జాతి, మతంతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛ, గౌరవం లభించే హక్కుల కోసం మనం పోరాడుతున్న ప్రత్యేక రాజ్యం ఇదేనా? మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా ఒకప్పుడు మత రహిత కోట. కానీ ఇప్పుడు హమాస్‌ మతపరమైన భావజాలాన్ని సమర్ధిస్తూ, ఇస్లాం పేరుతో పోరాడుతోంది. ”మేము దాని సైనికులం, శత్రువులను దహించే దాని అగ్ని కణాలం” అని హమాస్‌ మ్యానిఫెస్టో చెప్తుంది. ఆత్మాహుతి బాంబు దాడులు చేసే వారిని ఖండించాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు. కానీ వారు ఈ గమ్యానికి చేరుకోవడానికి ముందు వారు ప్రయాణించిన సుదీర్ఘమైన మార్గాన్ని మనం విస్మరించగలమా? 1922 సెప్టెంబర్‌ 11 నుండి 2002 సెప్టెంబర్‌ 11 వరకు 80 సంవత్సరాలు యుద్ధం చేయడం అనేది చాలా సుదీర్ఘ కాలం. పాలస్తీనా ప్రజలకు ప్రపంచం ఇవ్వగలిగిన సలహా ఏదైనా ఉందా? వారు గోల్డా మెయిర్‌ సూచనను స్వీకరించి, వారిని ఉనికిలో లేకుండా చేసే నిజమైన ప్రయత్నం ఏమైనా చెయ్యాలా?ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నేను న్యూ మెక్సికోలో ‘సెప్టెంబర్‌…రా..’ అంటూ ప్రసంగించినప్పుడు, పాలస్తీనా విషయంలో అమెరికాలో ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. దాని గురించి మాట్లాడిన వారు భారీ మూల్యాన్ని చెల్లించారు. నేడు యువకులంతా వీధుల్లో ఉన్నారు. ముందు నుంచి యూదులు, పాలస్తీనియన్లు నాయకత్వం వహిస్తూ, వారి ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహిస్తున్నారు. అత్యంత ఉన్నత ప్రాంగణాలతో పాటు విశ్వవిద్యాలయాలు అట్టుడికి పోతున్నాయి. వాటిని మూసేయడానికి పెట్టుబడిదారీ విధానం వేగంగా కదులుతున్నది. దాతలు నిధులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. తద్వారా అమెరికా విద్యార్థులు ఏం చెప్పవచ్చు లేదా ఏం చెప్పకూడదు, వారు ఎలా ఆలోచించాలి లేదా ఎలా ఆలోచించకూడదు అనేది నిర్ణయం అవుతుంది. ఉదారవాద విద్య అని పిలువబడే పునాది సూత్రాల ప్రధాన కేంద్రానికి ఇదొక దెబ్బ. వలసానంతర వాదం, బహుళ సాంస్కృతిక వాదం, అంతర్జాతీయ చట్టం, జెనీవా సభలు, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనల లాంటివి అన్నీ పోయాయి. వాక్‌ స్వేచ్ఛ లేదా ప్రజా నైతికత లాంటివి పోయాయి. అంతర్జాతీయ చట్టం న్యాయవాదులు, పండితులు చెప్పే ”యుద్ధం” జాతి సంహారం అన్ని చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. దీనిలో నేరస్థులు తమను తాము బాధితులుగా చెప్పుకున్నారు. వర్ణ వివక్షత రాజ్యాన్ని నడిపే వలసవాదులు అణచివేతకు గురైన వారుగా చెప్పుకున్నారు. 9/11 తరువాత పౌర హక్కులను విచ్ఛిన్నం చేయడానికి, విస్తృతమైన దురాక్రమణ నిఘా వ్యవస్థను నిర్మూలించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాలనా వ్యవస్థలకు అమెరికా యుద్ధం రక్షణను ఇచ్చింది. దానిలో మన ప్రభుత్వాలకు మన గురించి ప్రతీది తెలుసు కానీ మనకు వారి గురించి ఏమీ తెలియదు. అదేవిధంగా, అమెరికా నూతన మొకార్థీయిజం గొడుగు కింద ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఘోరమైన విషయాలు పెరిగి, అభివృద్ధి చెందుతాయి. మన దేశంలో కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభమైందనుకోండి. కానీ మనం మాట్లాడకుంటే, అది ఊపందుకుంటుంది, మనల్ని తుడిచి పెడుతుంది. భారతదేశంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీలలో ఒకటైన ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. నిరాహార దీక్ష లేదా ధర్నాకు దిగిన ఏ విద్యార్థి అయినా రూ.20 వేలు జరిమానా చెల్లించాలి. దేశ వ్యతిరేక నినాదాలు చేస్తే రూ.10 వేలు జరిమానా విధించారు. ఆ నినాదాలు ఏమిటి అనేవి ఇంకా ఆ జాబితాలో లేవు. కానీ ముస్లింల జాతి నిర్మూలన, ముస్లింల జాతి ప్రక్షాళన కోసం ఇచ్చే పిలుపులు దానిలో ఉండవని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి పాలస్తీనాలో యుద్ధం కూడా మనదే. మనం చెప్పవలసింది ఖచ్చితంగా చెప్పాలి, పదే పదే స్పష్టంగా చెప్పాలి. ఇజ్రాయిల్‌…వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించడం, గాజాను ముట్టడించడం మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు. ఆక్రమణకు పెట్టుబడి పెట్టి, మద్దతిచ్చిన అమెరికా, ఇతర దేశాలు కూడా ఆ నేరంలో భాగస్వాములే. ప్రస్తుతం మనం చూస్తున్న ఘోరం, పాలస్తీనా పౌరులను అనాలోచితంగా చంపడం అనేది ఆక్రమణ, ముట్టడిల పర్యవసానంగానే జరిగింది. క్రూరత్వం గురించి చేసే ఎన్ని వ్యాఖ్యానాలైనా, రెండు పక్షాల మితిమీరిన చర్యల ఖండనలైనా గానీ పరిష్కారం చూపవు. ఆక్రమణే రాక్షసత్వాన్ని పెంచుతుంది. ఇది నేరస్తులకు, బాధితులకు ఇరువురికీ హాని కలిగిస్తుంది. బాధితులు చనిపోతారు. నేరస్తులు, తాము చేసిన తప్పును నెత్తిమీద పెట్టుకుని జీవితాంతం మోయాల్సి ఉంటుంది. పరిష్కారం మిలిటరీ సంబంధమైనది కాదు. ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు ఇద్దరూ కలిసి గౌరవంగా, సమాన హక్కులతో జీవించాలనేది రాజకీయంగా మాత్రమే ఉంటుంది. ప్రపంచం జోక్యం చేసుకోవాలి. ఆక్రమణ అంతం కావాలి. పాలస్తీనియన్లు మాతృభూమిని కలిగి ఉండాలి. పాలస్తీనా శరణార్థులకు తిరిగి వచ్చే హక్కు ఉండాలి. లేకపోతే, పాశ్చాత్య ఉదారవాద నైతిక నిర్మాణం ఉనికిలో లేకుండా పోతుంది. ఇది ఎప్పుడూ కపటంగానే ఉన్నదనే విషయం మనకు తెలుసు. కానీ ఇది కూడా ఒక విధమైన ఆశ్రయాన్ని సమకూర్చింది. ఆ ఆశ్రయం మన కళ్ళ ముందే కనుమరుగవుతుంది. కాబట్టి దయచేసి పాలస్తీనా, ఇజ్రాయిల్‌ కోసం, జీవించి ఉన్నవారి కోసం, చనిపోయిన వారి పేరున, ఇజ్రాయిల్‌ జైల్లో ఉన్న పాలస్తీనియన్లు, హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న వారి కోసం, మొత్తం మానవాళి కోసం ఈ వధను ఆపండి.

  • – అరుంధతీ రాయ్

(డిసెంబర్‌ 13న తిరువనంతపురంలో నిర్వహించబడిన పి.గోవింద పిళ్ళై అవార్డు కార్యక్రమంలో అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్ ప్రసంగ పాఠం సంక్షిప్తంగా)

(”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో)

మొదటి భాగం ఈ క్రింది లింక్ లో చదవగలరు.

https://prajasakti.com/edit-page/india-has-lost-moral-standards/

 

➡️