దుబాయ్ : కువైట్ పాలక అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సాబా (86) శనివారం మరణించారు. చమురు సంపన్న దేశమైన కువైట్లోని అంతర్గత రాజకీయ వివాదాలను పరిష్కరించేందుకు ఆయన మూడేళ్లుగా కృషి చేస్తూ వచ్చారు. అధికారికంగా మృతి ప్రకటన వెలువడిన వెంటనే కువైట్ టెలివిజన్లో ఖురాన్ పఠించే కార్యక్రమాలు ప్రసారం చేశారు. ఈ విషాద వార్త తెలియగానే అరబ్, ఇస్లామిక్ దేశాలు, ఆయన మృతికి సంతాపం ప్రకటించగా, ప్రభుత్వం సంతాప దినాలు పాటిస్తోంది. ఆయన మృతికి కారణమేంటో అధికారులు వెల్లడించలేదు. కువైట్ యువరాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సాబాను కొత్త పాలకుడిగా ప్రకటించారు. నవంబరు చివరిలో షేక్ నవాఫ్ను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే వుంది. రాజభవనంలో అంతర్గత అధికారిక పోరు సాగుతున్నందున కువైట్ నేతల ఆరోగ్యం ఎప్పుడూ సున్నితమైన విషయంగానే ఉంటుంది.