ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కృష్ణా జలాల వివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కృష్ణా ట్రిబ్యునల్-2 టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టిఒఆర్) కృష్ణా ట్రిబ్యునల్-2కు సంబంధించిన టిఒఆర్పై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత విచారణ సందర్భంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఎపి దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోసారి ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ… కేసుకు సంబంధించి ప్లీడింగ్స్ పూర్తయ్యాయని, వాదనలకు కొంత సమయం కావాలని కోరారు. ఇందుకు అంగీకారం తెలిపిన ధర్మాసనం విచారణను మార్చి 13కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.