మన శరీరంలోని అన్ని అవయవాల్లో మూత్రపిండాలు కూడా అత్యంత ప్రధానమైనవి. అవి పనిచేయకపోతే మన శరీరంలో అనేక అవయవాలు దెబ్బతింటాయి. గుండె లాంటిదే కిడ్నీ కూడా. కిడ్నీల సమస్యలు రావడానికి మన జీవనశైలే ప్రధాన కారణమనేది ఆరోగ్య నిపుణులు చెప్తున్న మాట. అలాగే మనకున్న అనేక ఆరోగ్య సమస్యలు కూడా కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఆరోగ్యంగా ఉంటేనే కిడ్నీలు సరిగా పనిచేస్తాయి. మనదేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. గత రెండు దశాబ్దాలలో మూత్ర పిండాల సంబంధిత రోగులు రెట్టింపయ్యారు. దేశంలో కిడ్నీ మార్పిడి అవసరమైన వారు రెండు లక్షలు ఉండగా, ప్రతి సంవత్సరం కేవలం 12 వేల మూత్ర పిండ మార్పిడులు జరుగుతున్నాయి. ఈ లెక్కలన్నీ మూత్ర పిండాల ఆరోగ్య సమస్య తీవ్రతను తెలియజేస్తాయి. అయితే ఈ కిడ్నీ వ్యాధి సమస్య తగ్గించడం కోసం, వ్యాధికి గల కారణాలు, తీవ్రత తగ్గించడానికి అవసరమైన అవగాహన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నెల 14వ తేదీ ప్రపంచ కిడ్నీ అవగాహనా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సికెడి) ప్రపంచవ్యాప్తంగా 850 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తుందని అంచనా వేయబడింది. అలాగే 2019లో 31 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ప్రస్తుత మరణాలను పరిశీలిస్తే అన్ని వ్యాధులలో కన్నా కిడ్నీ వ్యాధి వల్ల అనేది ప్రధాన కారణాల్లో ఎనిమిదో స్థానంగా ఉంది. మనం పట్టించుకోకుండా వదిలేస్తే 2040 నాటికి ప్రాణాలు కోల్పోవడానికి ఇది 5వ స్థానంగా మారే ప్రమాదం ఉందనేది అంచనా వేయబడింది.
మనదేశం 140 కోట్ల జనాభాను కలిగి ఉంది. ఇటీవలి సంవత్సరాలలో దేశం ఆర్థికవృద్ధిని నమోదు చేసింది. డయాబెటిస్ మెల్లిటస్, హైపర్టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులలో గణనీయమైన పెరుగుదలతో పాటు అంటు వ్యాధులు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో మనదేశంలో ఎపిడెమియోలాజికల్ పరివర్తన జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. 2015లో రెడ్డీ ఇటి ఎఎల్ (REDDY et al) ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం మనదేశంలో కనీసం 53 శాతం మరణాలు దీర్ఘకాలిక వ్యాధులే కారణమయ్యాయి.
సికెడి యొక్క ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని ఇప్పుడు బాగా గుర్తించబడింది. చివరిదశ మూత్రపిండ వ్యాధి (ఇఎస్ఆర్డి) సంఖ్య యొక్క ప్రపంచ వార్షిక వృద్ధి ఏడు శాతం వద్ద నివేదించబడింది. సమగ్ర సికెడి రిజిస్ట్రీ (www.ckdri.org) లేకపోవడం వల్ల మనదేశంలో సికెడి, ఇఎస్ఆర్డి భారం యొక్క కచ్చితమైన అంచనా ప్రస్తుతం సాధ్యం కాదు.
గత మూడు దశాబ్దాలుగా సికెడి చికిత్స ప్రయత్నాలు కిడ్నీ మార్పిడి.. డయాలిసిస్ మీద కేంద్రీకృతమై వున్నాయి. సైన్స్లో ఇటీవలి పురోగతులు కిడ్నీ వ్యాధి, దాని సంక్లిష్టతలను నివారించడానికి కొత్తగా వివిధ చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేశాయి. ఇవి సికెడితో నివసించే వ్యక్తుల జీవిత నాణ్యత, జీవన పరిమాణాన్ని పొడిగిస్తాయి.
ఈ కొత్త చికిత్సలు రోగులందరికీ సార్వత్రికంగా అందుబాటులో ఉండాలి, ప్రతి దేశంలో సికెడి గురించి అవగాహన లేకపోవడం.. కొత్త చికిత్సా పద్ధతులతో విశ్వాసం లేకపోవడం.. కిడ్నీ నిపుణుల కొరత, చికిత్స ఖర్చులు వంటి అవరోధాలు చికిత్సలను చేరువ చేయడంలో తీవ్ర అసమానతలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమస్య తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో, ఈ అసమానతలు సికెడి గురించిన అవగాహన, హెల్త్కేర్ వర్క్ఫోర్స్ యొక్క కెపాసిటీ బిల్డింగ్ వైపు దృష్టి మరల్చవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.
- ఆరోగ్య విధానాలు..
‾‾‾‾‾‾‾‾‾‾‾
- సికెడి యొక్క ప్రాథమిక నివారణకు ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కార్యక్రమాలలో కిడ్నీ సంరక్షణను సమగ్రంగా చేర్చడం.. కిడ్నీ సంరక్షణ కోసం అవసరమైన నిధులు.. ప్రజలకు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కిడ్నీ ఆరోగ్య పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేసే ఆరోగ్య విధానాలు అవసరం. సికెడి లేదా దాని పురోగతిని నివారించడానికి మూత్రపిండ వ్యాధి స్క్రీనింగ్కు సమానమైన ప్రాముఖ్యత, ముందస్తు రోగ నిర్ధారణ కోసం సాధనాలు, నాణ్యమైన చికిత్స ఇవ్వగలగాలి.
- సికెడి కోసం ముందస్తుగా గుర్తించే కార్యక్రమం అవసరం అనే అంగీకారం ఉన్నప్పటికీ, భారతదేశం వంటి దేశంలో ప్రజలకందరికీ స్క్రీనింగ్ పరీక్షలు చేయటం సాధ్యం కాదు. K/DOQI సూచించినట్లుగా మధుమేహం, అధిక రక్తపోటు, వృద్ధులు, కుటుంబంలో సికెడి ఉన్న వారికీ, అధిక ప్రమాదం ఉన్న జనాభాను పరీక్షించడం మరింత సముచితంగా ఉండవచ్చు.
- హెల్త్కేర్ డెలివరీ – నేషనల్ పాలసీ ఈ సమస్య మీద అంతగా దృష్టిపెట్టక పోవటం. పేషెంట్కు ఈ వ్యాధుల మీద అవగాహన లేకపోవటం. ఖరీదైన వైద్యం, మందులు అందరికీ అందుబాటులో లేకపోవటం. వీటన్నింటివలన పేషెంట్లకు మనం అవసరమైన వైద్యం ఇవ్వలేని పరిస్థితులలో వున్నాము.
- సరైన మూత్రపిండ సంరక్షణను సాధించడానికి ప్రపంచ ప్రాంతాలలో సందర్భోచిత వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుంటూ బహుళ స్థాయిలలో అడ్డంకులను అధిగమించడం అవసరం.
- ఆరోగ్య సంరక్షణ నిపుణులు – ప్రాథమిక సంరక్షణ నిపుణులు, కిడ్నీ నిపుణుల కొరతను పరిష్కరించడానికి శిక్షణను మెరుగుపరచడం. ప్రాథమిక సంరక్షణ వైద్యులు, నర్సులు, కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలతో సహా వారి సామర్థ్యాన్ని పెంపొందించడం అవసరం. సరైన సికెడి స్క్రీనింగ్పై విద్య, క్లినికల్ ప్రాక్టీస్ మార్గదర్శక సిఫార్సులకు కట్టుబడి ఉండటం. సమర్థవంతమైన, సురక్షితమైన చికిత్సా వ్యూహాలను విజయవంతంగా అమలు చేయడానికి కీలకం.
- శాస్త్రీయ ఆవిష్కరణలను స్వీకరించడం.. సికెడి చికిత్స కోసం ఫార్మకోలాజిక్, నాన్-ఫార్మకోలాజిక్ సాధనాలను ఉపయోగించడం. అలాగే నిపుణుల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్ పెంపొందించడం.. రోగి శ్రేయస్సును బాగా ప్రభావితం చేస్తుంది.
- రోగులు, కమ్యూనిటీలకు సాధికారత కల్పించడం – ప్రపంచవ్యాప్తంగా, అధిక ఖర్చులు, తప్పుడు సమాచారం కారణంగా రోగులు సంరక్షణ, మందులను పొందేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఇది వారి ఆరోగ్య ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి సికెడి ప్రమాద కారకాల గురించి అవగాహన పెంచడం. ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికల గురించి ఆరోగ్య అక్షరాస్యతను పెంపొందించడం. స్వీయ-సంరక్షణ, చికిత్సా పద్ధతులకు దీర్ఘకాలిక కట్టుబడి ఉండడాన్ని ప్రోత్సహించడం. ప్రత్యేకించి ముందుగా ప్రారంభించి, స్థిరంగా నిర్వహించబడినప్పుడు పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు.
- న్యాయవాద సంస్థలు, స్థానిక కమ్యూనిటీలలో రోగులను చేర్చుకోవడం. దీనివలన వారికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి – వారి ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి వారికి అధికారం లభిస్తుంది.
- కిడ్నీ వ్యాధి వృద్ధులకు లేదా మద్యం సేవించేవారికే వస్తుందనుకుంటే పొరపాటే. మీ జీవనశైలిలోని కొన్ని అలవాట్లు కూడా మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తాయి. కిడ్నీలు దెబ్బ తినడానికి మద్యం మాత్రమే కారణం కాదని.. మనం తీసుకునే ఆహారం, జీవనశైలి అలవాట్లు కూడా.. మీ కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి. ప్రొటీన్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తరచూ తీసుకోవడం వల్ల కూడా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
సికెడి కారణాలు..
‾‾‾‾‾‾‾‾‾‾‾
1 . మధు మేహం, రక్తపోటు అతి ముఖ్యకారణాలు
2 . వంశపారం పర్యగా వచ్చే వ్యాధులు.
ఉదా : పాలీసిస్టిక్ కిడ్నీస్
3 . కిడ్నీలో రాళ్లు
4 . వైద్యులు రాయకుండా మందులు అతిగా వాడటం (నొప్పుల మాత్రలు, స్టెరాయిడ్స్, ఇటిసి)
5 . అతిగా యాంటీబయాటిక్స్ వాడటంలాంటివి.
6. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం. జంతు ప్రొటీన్ రక్తంలో అధిక మొత్తంలో యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అసిడోసిస్కు కారణమవుతుంది. ఈ పరిస్థితిలో మూత్రపిండాలు తగినంత ఆమ్లాన్ని తొలగించలేవు. ఇది అవయవాలపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. తినే ఆహారం ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలతో సమతుల్యంగా ఉండాలి.
7. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం. ఉప్పు అధికంగా ఉండే ఆహారంలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అంతేకాకుండా మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.
8. పెయిన్ కిల్లర్స్ – నొప్పులను తాళలేక పెయిన్ కిల్లర్స్ వాడే వారు జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం పెయిన్కిల్లర్స్ వాడడం వల్ల నొప్పికి ఉపశమనం కలగవచ్చు. కానీ వాటి ప్రభావం మాత్రం మూత్రపిండాలపై ఎక్కువగా ఉంటుంది. నొప్పి నివారణ మందులను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50% పెరుగుతుంది.
9. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం – ప్రాసెస్ చేయబడిన ఆహారం మీ మూత్రపిండాలకు చాలా హానికరం. ప్రాసెస్ చేసిన ఆహారాలు సోడియం, ఫాస్పరస్ కలిగి ఉండి మూత్రపిండాల వ్యాధికి దారితీయవచ్చు. జంక్ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు మూత్రపిండాలకు దీర్ఘకాలిక నష్టం కలిగించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, శరీరం తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయనందున, ప్రాసెస్ చేసిన ఆహారాల నుంచి వచ్చిన చక్కెర రక్తంలో పేరుకుపోతుంది. అది డయాబెటిక్ కిడ్నీ వ్యాధికి దారితీస్తుంది.
10. అతిగా మద్యం సేవించడం – రోజుకు నాలుగు కంటే ఎక్కువ పానీయాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఆల్కహాల్.. మూత్రపిండాల పనితీరులో మార్పులకు కారణమవుతుందని, రక్తాన్ని వడపోసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది.
దీర్ఘకాలిక వైఫల్య లక్షణాలు…
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
చర్మము పాలిపోవుట, ఇది సాధారణంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వల్ల వచ్చే రక్తహీనత కారణంగా వస్తుంది.
శరీరంలో నీరు చేరటం, రక్తహీనత, కార్డియోమయోపతి (గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి) మొదలైన వాటివల్ల శ్వాస ఆడకపోవడం.
దురద, ఇది సాధారణంగా యురేమిక్ టాక్సిన్స్, రోగనిరోధక ప్రతిస్పందనలో సడలింపు కారణంగా ఉంటుంది.
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులలో జీవరసాయన అసాధారణతల వల్ల కలిగే నాడీవ్యవస్థ చికాకు కారణంగా రాత్రిపూట తిమ్మిర్లు రావడం.
ఆకలి కోల్పోవడం, వాంతులు, రుచి భంగం వంటి జీర్ణశయాంతర లక్షణాలు అనేవి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులలో సంభవించవచ్చు.
ఎక్కువ మూత్రవిసర్జన, తక్కువ మొత్తంలో మూత్రం, రాత్రి సమయంలో మూత్రం. మూత్రంలో ప్రోటీన్ వంటి మూత్ర ఉత్పత్తిలో మార్పులు.
మూత్రంలో రక్తం.
మీ దిగువ కాళ్ళు, చేతుల్లో నీరు ఏర్పడటం
- నివారణ మార్గాలు..
- ‾‾‾‾‾‾‾‾‾‾‾‾
- కుటుంబంలో కిడ్నీ వ్యాధులు వున్నప్పుడు షుగర్, బీపీ వ్యాధులు వున్నపుడు ఇతర కుటుంబ సభ్యులందరూ సంవత్సరానికి ఒక్కసారి స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలి. సీరం క్రియాటినిన్, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ మూత్ర పరీక్షలు చేయించుకుంటూ ఉంటే మంచిది.
- షుగర్, బీపీ వున్నప్పుడు జీవన విధానాలలో మార్పులు అవసరం. రెగ్యులర్గా నెలకు ఒక్కసారి ఇంటి దగ్గరే షుగర్, బీపీ చూపించుకోవటం. ఎక్కువగా ఉంటే డాక్టర్ను సంప్రదించటం చేయాలి. అన్ని సరిగా వున్నా సంవత్సరానికి ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి, సలహాలు తీసుకుంటే మంచిది.
- రోజు ఒకే సమయంలో ఆహారం తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక గంట వ్యాయామం చేయాలి. ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నడక, పరుగు, సైకిల్, ఈత, ఏ రకమైన వ్యాయాయమైనా తమ తమ ఇష్టాన్ని, అవకాశాన్ని బట్టి చేయటం మంచిది.
- స్వీట్స్, ఉప్పు సాధ్యమైనంత వరకు తగ్గించాలి.
- ఎల్లప్పుడూ తాజాగా తయారుచేసిన ఆహారాన్ని తినండి. నిల్వ చేసిన ఆహారాన్ని నివారించేందుకు ప్రయత్నించండి.
- మీ బీపీ ఎల్లప్పుడూ 110/80 కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి.
- నాటు మందులు వాడటం మంచిది కాదు.
- మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం. యోగ / మెడిటేషన్ లాంటివి కూడా మనకు బీపీ కంట్రోల్ చేస్తాయి.. సికెడిలో ఉపయోగపడతాయి.
- కిడ్నీ జబ్బు ముదిరిన తర్వాత మనకు ఉన్న వైద్య అవకాశాలు (డయాలసిస్ / కిడ్నీ మార్పిడి) గురించి ముందుగా తెలుసుకొని ఉండటం మంచిది.
- సికెడిని దాని కోర్సు ప్రారంభంలోనే గుర్తించడం. తగిన జోక్యంతో సికెడి యొక్క పురోగతిని ఆలస్యం చేయవచ్చు.
- ఇఎస్ఆర్డిని ఆలస్యం చేయవచ్చు. భారతదేశం కిడ్నీ మార్పిడిని బాగా ప్రోత్సహించాలి. నివారణ వ్యూహాల వైపు దృష్టి సారించాలి. – తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు సంబంధించిన స్థానిక వనరులకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను పునఃరూపకల్పన కోసం డబ్ల్యుహెచ్ఓ ‘ఇన్నోవేటివ్ కేర్ ఫర్ క్రానిక్ కండిషన్స్ ఫ్రేమ్వర్క్’ నమూనాను రూపొందించింది.
ఈ మోడల్కు ప్రధానమైనది రోగి, ఆరోగ్య సంరక్షణ బందం.. సంఘం మధ్య భాగస్వామ్య త్రయం అవసరం. వ్యవస్థీకృతంగా, తగిన విధంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య సంరక్షణ బృందాల నేపథ్యం, సానుకూల విధాన వాతావరణం కీలకం. నివారణ విధానం యొక్క విజయానికి కీలకం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు. వైద్యుల కోసం నిరంతర వైద్య, విద్యా కార్యక్రమాలు నిర్వహించాలి.
- డయాలసిస్
—-> డయాలసిస్ అనేది మన రక్తం నుంచి మలినాలు తీసే ఒక ప్రక్రియ. దీని మీద చాలా మందికి చాలా అపోహలు వున్నాయి. చాలామంది ఇది ఒకసారి మొదలైతే జీవితాంతం చేసుకోవాలి అనే అపోహలో వుంటారు. కానీ చాలా వ్యాధులలో కిడ్నీలు తాత్కాలికంగా పాడవుతాయి. ఉదాహరణకి ఇన్ఫెక్షన్ల వల్ల.. విషజ్వరాల వల్ల.. పాముకాటు వల్ల.. రాళ్ళ వల్ల వచ్చిన వ్యాధులు 4 -5 సార్లు లేదా తగ్గేవరకూ డయాలసిస్ చేస్తే వ్యాధి మొత్తం తగ్గిపోతుంది.
—-> సికెడి వల్ల వచ్చే జబ్బుకి డయాలసిస్ జీవితాంతం వారానికి రెండు లేదా మూడు సార్లు అవసరం ఉంటుంది.
—-> డయాలసిస్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హీమో డయాలసిస్, రెండవది పెరిటోనియల్ డయాలసిస్.
—-> హీమో డయాలసిస్ అంటే పేషెంట్ వారానికి రెండుసార్లు / మూడుసార్లు గానీ ఆసుపత్రికి వచ్చి, డయాలసిస్ చేయించుకుని వెళ్లాలి.
—-> పెరిటోనీల్ డయాలసిస్ అంటే ఒక అసిస్టెంట్ సహాయంతో ఇంటిదగ్గర పేషంటు చేసుకొనే ప్రక్రియ.
—-> డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్తో పాటు బీపీ తగ్గడానికి, రక్తం పట్టడానికి మందులు డాక్టర్ చెప్పినట్టు వేసుకోవాలి.
—-> ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో హీమోడయాలసిస్ అనేది ప్రజలకు చేరువైందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ డయాలసిస్ పాలసీ సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వం చాలా మండలాలలో డయాలసిస్ సెంటర్లను పెట్టి, డయాలసిస్ను ప్రజలకు చేరువగా చేసింది. దీనివలన ప్రజలు డయాలసిస్ కోసం సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవసరం తప్పింది. అంతేకాకుండా డయాలసిస్ పేషెంట్లకు నెలకు పది వేల రూపాయలు పెన్షన్ సహకారం కూడా ఇస్తుంది.
- కిడ్నీ మార్పిడి..
—-o రెండు కిడ్నీలు 100 శాతం పాడయినప్పుడు కిడ్నీ మార్పిడి అవసరమవుతుంది.
—-o ఇచ్చేవాళ్ళు ఒక కిడ్నీ ఇస్తే సరిపోతుంది.
—-o మన కుటుంబంలో ఎవరైనా ఒకరు కిడ్నీ ఇవ్వగలిగిన అవకాశం వున్నప్పుడు వారి నుంచి తీసుకుంటే మంచిది.
—-o భారతదేశంలో ప్రతి సంవత్సరం 4000 కంటే ఎక్కువ మూత్రపిండ మార్పిడిలు జరుగుతాయి.
—-o అత్యధికులు జీవించి ఉన్న దాత నుండి మూత్రపిండాలను ఉపయోగిస్తున్నారు.
—-o మార్పిడి చేయించుకున్న తర్వాత కూడా, రోగులు జీవితాంతం రోగనిరోధక శక్తిని తగ్గించే మందులను తీసుకోవాలి.
—-o మందులు ఖరీదైనవి, ఇన్ఫెక్షన్లు ప్రధాన ఆందోళనగా ఉన్నాయి. కాబట్టి పేద గ్రామీణ రోగులకు ఇది అందడం కష్టంగా ఉంది. ప్రభుత్వాలు వీరికి ఈ సౌకర్యం కలిగించేలా దృష్టి పెట్టాలి.
—-o అమ్మ, నాన్న, అక్క, చెల్లి, కొడుకు, కూతురు కిడ్నీ దానం ఇచ్చినప్పుడు వాళ్ళ మధ్య జన్యుపరమైన సంబంధం ఉంటుంది. దీనివలన కిడ్నీ ఎక్కువ కాలం మనగలిగే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ ముందు, తర్వాత తక్కువ మందులు అవసరం పడతాయి. అలాగే చట్టపరమైన చర్యలు వుండవు.
—-o దగ్గర కుటుంబంలో ఎవరూ లేనప్పుడు, దూర సంబంధీకులు, స్నేహితులు ఇవ్వవచ్చు. కానీ ఇలాంటివాళ్ళు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం నియమించిన కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలి.
—-o కిడ్నీని ఎవరైనా చనిపోయిన తర్వాత వారి దగ్గర నుంచి తీసుకొనే ప్రక్రియను కడావర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అని అంటారు. ఇది మన భారతదేశంలో ప్రారంభ దశలో ఉంది. మన ఇంట్లో ఉన్నవాళ్లుగానీ దగ్గర చుట్టాల్లో గానీ ఎవరూ కిడ్నీ ఇవ్వలేనప్పుడు కడావర్ ట్రాన్స్ ప్లాంటేషన్కి వెళ్ళవచ్చు. దీనికి మనము జీవనదాన్ అనే గవర్నమెంట్ పోర్టల్లో మనపేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కిడ్నీ తీసుకునే అవకాశం మనకు వస్తుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ.
- ఆహారం వల్ల..
- ఉప్పు. ప్రతిరోజూ మనకు రెండు నుంచి నాలుగు గ్రాములు ఉప్పు సరిపోతుంది. కానీ మన దక్షిణ భారతదేశం డైట్లో మనం సుమారుగా 10 నుంచి 15 గ్రాముల ఉప్పుని తీసుకుంటాం. ముఖ్యంగా ఎర్ర నిల్వ ఉన్న పచ్చళ్ళు, జంక్ ఫుడ్స్ కారణం. ఉప్పు ఎక్కువగా తినటం వల్ల హైబీపీ,.. బీపీ ఎక్కువ అవ్వటం వల్ల కిడ్నీ జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది.
- పొలాలు / మొక్కలకు వాడే పురుగు మందులు.. వాటి అవశేషాలు మనం తినే ఆహార పదార్థాలలో కలిసిపోవడం. దీనివలన అనేకరకాల ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది. ఈ మధ్యకాలంలో చాలా కిడ్నీ జబ్బులకు కారణం కూడా తెలియడం లేదు. ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ / పెస్టిసైడ్స్ కూడా కారణాలని చాలా అధ్యయనాల్లో ఇప్పుడు వెల్లడైంది. పురుగు మందుల వినియోగం తగ్గిస్తే మంచిది.
- సుమారుగా రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకూ నీరు తీసుకుంటే మంచిది. మనం చేసే పనిని బట్టి ఇంకా ఎక్కువగా కూడా తీసుకుంటే మంచిది. ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.
- ఆరోగ్యం చక్కగా ఉండాలంటే అన్ని రకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, సరిపడినంత తీసుకుంటూ ఉండాలి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమపాళ్లల్లో ఉండేటట్లు తింటే మంచిది. నాన్ వెజిటేరియన్ డైట్ మరీ ఎక్కువ తినటం మంచిది కాదు.
- మనము తరచూ వాడే ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ వస్తువులు వాతావరణంలో వందల సంవత్సరాల అలానే ఉండిపోతాయి. మనం తినే ఆహారాన్ని, నీటిని కలుషితం చేస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వస్తువులు చిన్నచిన్న రేణువులుగా మారి, గాలిలో కలిసి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి జబ్బు కురిచేస్తున్నాయి. ఇవి కూడా కిడ్నీకి జబ్బులకు ఒక కారణం. ప్లాస్టిక్ వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిది.
- సంరక్షణ.. సరైన మందులు..
ఏటా మార్చి 14న జరిగే ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2024 ”అందరికీ కిడ్నీ ఆరోగ్యం – సంరక్షణ / సరైన మందుల సాధనకు సమానమైన ప్రాప్యతను మెరుగుపరచడం.” థీమ్. నేపథ్యం / లొకేషన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన కిడ్నీలను నిర్వహించడానికి అవసరమైన సంరక్షణ , మందులకు ప్రాప్యత కలిగి ఉండేలా చూసుకోవడం దీనియొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారాన్ని ప్రపంచ కిడ్నీ అవగాహనా దినోత్సవంగా జరుపుకుంటారు. గ్లోబల్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తారు. మన ఆరోగ్యానికి కిడ్నీల ప్రాముఖ్యతను తెలపడమే దీని లక్ష్యం. కిడ్నీ వ్యాధి, దానితో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యల గురించి ప్రజలకు తెలియ చెప్పటమే దీని లక్ష్యం.
డాక్టర్ గొంది శివరామకృష్ణ
అసోసియేట్ ప్రొఫెసర్,
ఇన్ఛార్జ్ హెచ్ఓడి
జిజిహెచ్, గుంటూరు
9490808156
సంభాషణ : యడవల్లి శ్రీనివాసరావు, 9490099214