ఖేల్‌ రత్న, అర్జున అవార్డులు వెనక్కి

Dec 31,2023 09:11 #Arjuna, #Awards, #back, #Khel Ratna
  • ప్రధానికి ఇవ్వడానికి బయలుదేరిన వినేష్‌ ఫోగాట్‌
  • అడ్డుకున్న పోలీసులు,రోడ్డుపై నిరసన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రప్రభుత్వంపై రెజ్లింగ్‌ క్రీడాకారులు తమ నిరసనను తీవ్రతరం చేశారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రెజ్లర్‌ వినేష్‌ ఫోగాట్‌ ఖేల్‌ రత్న, అర్జున అవార్డులను కర్తవ్యపథ్‌లో పేవ్‌మెంట్‌పై విడిచిపెట్టారు. శనివారం అర్జున అవార్డు, ఖేల్‌ రత్న అవార్డులను ప్రధాని మోడీకి ఇస్తామంటూ ప్రధానమంత్రి కార్యాలయం వైపు బయల్దేరారు. పోలీసులు అనుమతించకపోవడంతో కర్తవ్య పథ్‌ వద్ద రోడ్డుపై నిరసన తెలిపారు అనంతరం అక్కడే ఆ అవార్డులను విడిచిపెట్టారు. కొద్ది రోజుల క్రితం ప్రధానికి వినేష్‌ రాసిన లేఖలో బ్రిజ్‌ భూషణ్‌పై చర్య తీసుకోకపోవడాన్ని ప్రస్తావించారు. ఖేల్‌ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని పేర్కొన్నారు. ఈ లేఖపై ప్రధాని కార్యాలయం స్పందించకపోవడంతో రెజ్లర్లు తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. హోం మంత్రి అమిత్‌ షా, క్రీడా మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఇచ్చిన హామీలను ఉల్లంఘించి బ్రిజ్‌భూషణ్‌ అనుయాయుడు సంజరు కుమార్‌ సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ తన రెజ్లింగ్‌కు రాజీనామా చేశారు. మీడియా ముందు కంటతడి పెట్టారు. రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాను క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. అప్పుడు కూడా బ్రిజ్‌ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ సిద్ధం కాలేదు. ఆ తరువాత రెజ్లర్‌ బజరంగ్‌ పునియా పద్మశ్రీని, వీరేందర్‌ సింగ్‌ యాదవ్‌ పతకాన్ని తిరిగి ఇస్తామని ప్రకటించగా, వినేష్‌ ఫోగట్‌ అవార్డును వెనక్కి ఇచ్చారు.

➡️