రెండు రోజుల్లో పొత్తుపై నిర్ణయం ప్రకటిస్తాం : కమల్‌హాసన్‌

చెన్నై :   రెండు రోజుల్లో పొత్తు ప్రకటన వెల్లడిస్తామని  మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన సోమవారం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటు ఎన్నికల సన్నాహాలకు సంబంధించి చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

రెండు రోజుల్లో శుభవార్తతో మిమ్మల్ని కలుస్తానని మీడియాతో  అన్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పనులు బాగా జరుగుతున్నాయని, మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తాం చెప్పారు.

పార్లమెంటరీ ఎన్నికల సమయంలోనే పొత్తుపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని డిఎంకె నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించారు.

తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ ప్రిపరేషన్‌ వర్క్స్‌ కోసం ఆమెరికా వెళల్లిన ఆయన సోమవారం ఉదయం చెన్నై చేరుకున్నారు. 2018లో కమల్‌హాసన్‌ ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఎదుర్కొంది.

➡️