21 సంవత్సరాల తర్వాత ఒకే సెట్‌లో కలిసిన కమల్‌,రజనీ

Nov 23,2023 17:44

ఒకే స్టూడియోలో.. ఇద్దరు లెజెండ్స్‌ కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ 21 సంవత్సరాల తర్వాత ఒకే సెట్‌లో కలిశారు. కమల్‌ హీరోగా నటిస్తున్న ఇండియన్‌-2, రజనీకాంత్‌ నటిస్తున్న 170వ చిత్రం షూటింగ్‌ చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియోలో వేర్వేరు ఫ్లోర్స్‌లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ స్టార్‌ హీరోలిద్దరూ ఆ స్టూడియోలో కలిశారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇలా వృత్తిరీత్యా కలవడంతో ఆనందంలో మునిగితేలారు. సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్‌-2’. ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియో ఎరీనాలో జరుగుతోంది. దీనికి సమీపంలోనే రజినీకాంత్‌ హీరోగా జ్ఞానవేల్‌ దర్శకత్వంలో టి.జె. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న మరో చిత్రం ‘తలైవర్‌ 170’ షూటింగ్‌ జరుగుతోంది. తన షూటింగ్‌ స్పాట్‌కి సమీపంలోనే ‘ఇండియన్‌-2’ షూటింగ్‌ జరుగుతోందని తెలుసుకున్న రజినీకాంత్‌ తన మిత్రుడు కమల్‌హాసన్‌ని కలవటానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కమల్‌ హాసన్‌, ఉదయం 8 గంటలకే తలైవర్‌ 170 షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లి ‘నేను నా స్నేహితుడిని కలవడానికి వస్తున్నాను’ అంటూ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. చిరకాల మిత్రుడు కమల్‌హాసన్‌ను చూసి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు బాబా, పంచ తంత్రం షూటింగ్స్‌ ఒకే చోట జరిగినప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. ఇది జరిగి 21 సంవత్సరాలు అవుతున్నాయి.

➡️