రేపు కవితను కోర్టు ప్రవేశపెట్టనున్న సిబిఐ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు కెటీఆర్ ఆదివారం కలిశారు. ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావులతో కలిసి కెటిఆర్ కవితను సాయంత్రం ఆరు గంటలకు కలిశారు. దాదాపు 40 నిమిషాలకు పైగా కవితతో మాట్లాడారు. విచారణలో సిబిఐ అడుగుతోన్న ప్రశ్నలపై ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యం వీడొద్దని, తాము తోడుగా ఉంటామని ధైర్యం చెప్పారు. సోమవారం కవితను ట్రయల్ కోర్టు ముందు హాజరుపరిచే నేపథ్యంలో కోర్టు దృష్టికి తెచ్చే అంశాలపై చర్చించారు. అనంతరం భర్త అనిల్ తో కవిత కాసేపు మాట్లాడారు.
కాగా, కవితను ఆదివారం సిబిఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. లిక్కర్ స్కాంలో సంబంధమే లేకపోతే… అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డితో జరిగిన లావా దేవీల సంగతి గురించి ప్రశ్నించారు. మహబూబ్ నగర్ లోని రూ.14 కోట్ల వ్యవసాయ భూమిని ఎందుకు శరత్ చంద్రారెడ్డి కొనుగోలు చేసేలా ఒత్తిడి చేశారని ఆరా తీసింది. అలాగే, తెలంగాణ జాగృతికి సిఎస్ఆర్ రూంలో శరత్ చంద్రా రెడ్డి ఇచ్చిన రూ. 80 లక్షలపై పలు ప్రశ్నలు సందించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన కస్టడి సమయం ఆదివారంతో ముగియడంతో… కవితను ఆదివారం ఉదయం 10 గంటలకు సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపరుచనున్నారు.