కథానాయకుడు ఎన్టీఆర్ నటించనున్న 31వ సినిమా ఇప్పటికే ఖరారైంది. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనుండగా, మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ ధ్రువీకరిస్తూ చిత్ర కథాంశంపైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ‘దీన్ని అందరూ ఓ యాక్షన్ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు. కానీ, నేను నా జానర్లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను’ అని ప్రశాంత్ వెల్లడించారు.