న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసు తీర్పు వెలువడిన రెండు రోజులకే ఆమె తండ్రి మరణించారు. ఇటీవల నిందితులకు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్ (82) శనివారం కన్నుమూశారు. విచారణకు రెండు రోజుల ముందు ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూనే, తన కూతురి హత్య కేసులో నిందితులకు శిక్ష పడిందని తెలుసుకున్నారు.
26 ఏళ్ల సౌమ్యవిశ్వనాథన్ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా హత్యకు గురయ్యారు. 2008లో ఈ ఘటన జరిగింది. ఆమె తల్లిదండ్రులు ఎంకే విశ్వనాథన్, మాధవి విశ్వనాథన్లు నిందితులకు శిక్షపడే వరకు సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. 15 ఏళ్ల నుండి వారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఇండియా టుడే గ్రూప్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథాన్ని సెప్టెంబర్ 30, 2008 తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్లో హత్యకు గురయ్యారు. సౌమ్య విశ్వనాథన్ విధులు ముగించుకుని కారులో ఇంటికి వెళ్తుండగా ఓ కారుని ఓవర్టేక్ చేశారు. తమ కారుని ఓ మహిళ ఓవర్టేక్ చేయడాన్ని భరించలేని దోషులు ఆమె కారుని అడ్డగించేందుకు యత్నించారు. సౌమ్య కారువేగాన్ని పెంచడంతో నిందితులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆమె తలకు గాయమై అక్కడికక్కడే మరణించారు. నిందితులు వెంటనే అక్కడినుండి పారిపోయారు. 20 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి పోలీసులను చూసి పారిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.
నేరం జరిగిన 15 ఏళ్ల తరువాత నిందితులకు శిక్షను విధించింది. హత్య, సాధారణ ఉద్దేశంతోనే రవి కపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను అక్టోబర్ 18న కోర్టు దోషులుగా నిర్ధారించింది.