హైదరాబాద్: జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్ షా విధానమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారని.. అధికారం కోసం అడ్డదారులు తొక్కరని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అవగాహన లేదని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ ఓ సారి బీజేపీ అంటారని, ఇంకోసారి కాంగ్రెస్ అంటారని.. ఆయన బతుకుదెరువు కోసం సర్వే సంస్థను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని పీకే చెప్పారని.. కానీ కాంగ్రెస్ గెలిచిందన్నారు.
పీసీసీ చీఫ్ పదవి తాను కోరుకోవడం కొత్త కాదు.. అడగడం తప్పు కాదని ఆయన వ్యాఖ్యానించారు. పీసీసీ మార్పుకు కొంత సమయం ఉందని.. తొందర లేదని మీడియాతో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి కదా అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాను బస్టాండ్లో ఉంటానని, ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు ఎక్కుతా అంటూ పీసీసీ పదవిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పీసీసీ, సీఎం ఒక్కరే అయి ఉంటే బాగుంటుందని అలా కొనసాగుతున్నారని పేర్కొన్నారు.