హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తెలంగాణ మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో ఏపీ సిఎం జగన్ హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో వై.ఎస్. జగన్కు బిఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుండి సిఎం జగన్ హైద్రాబాద్ జూబ్లీహిల్స్లోని నందినగర్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్కు కేటీఆర్ ఆహ్వానం పలికి, లోపలకు తీసుకెళ్లారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. దాదాపు గంటసేపు కేసీఆర్ నివాసంలో జగన్ గడపనున్నారు. లంచ్ మీటింగ్ కూడా ఉందని తెలుస్తోంది. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన తర్వాత జగన్ విజయవాడకు తిరుగుపయనమవుతారు.