ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం మంగళవారం నుంచి ప్రారంభం కానుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 4 వరకు ఈ ప్రక్రియ జరగనుందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 23 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొంటారని తెలిపారు. దాదాపు 60 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయనున్నారని పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 పత్రాలను మూల్యాంకనం చేస్తారని వివరించారు. ఫిబ్రవరి 29 నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు 10,52,221 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,34,604 మంది ఉన్నారు.