ప్రజాశక్తి-పాడేరు టౌన్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిఘా నీడలో జరగనున్నాయి. ఈనెల 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లను విడుదల చేశారు. ఈసారి కూడా నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్న నిబంధన అమలులో ఉంది. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఉన్నతాధికారులు దిశా నిర్దేశం చేశారు.ఈనెల 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అల్లూరి జిల్లా పాడేరు, రంపచోడవరం డివిజన్ లలో అధికారులు ఏర్పాటు చేశారు. 1న ఇంటర్ ఫస్టియర్ పరీక్షతో ప్రారంభమై, ప్రతిరోజూ ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలకు కూడా జెఇఇ తరహాలో ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించకూడదని గత విద్యా సంవత్సరం నుంచి అమలులో ఉన్న నిబంధన ఈ సారి కూడా అమలు చేస్తున్నారు. పాడేరు డివిజన్ 11 మండలాల్లో 17 కేంద్రాల్లో, రంపచోడవరం డివిజన్లో 10 కేంద్రాల్లో మొత్తం 27 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు యంత్రాంగం ఏర్పాటు చేసింది. జనరల్లో 6013, ఒకేషనల్ 1387 కలిపి ఫస్టియర్ లో 7400, సెకెండియర్ లో జనరల్ 4807, ఒకేషనల్ 1038 కలిపి 5845 మొత్తం 13245 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, 297 మంది ఇన్విజిలేటర్ లను నియమించారు. కస్టోడియన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు 2, సిట్టింగ్ స్క్వాడ్లు 2 ఉంటాయి. వీరితోపాటు జిల్లా కలెక్టర్, ఐటిడిఎల పిఒలు, డిఇఒ, రెవెన్యూ అధికారులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటుపాడేరు డివిజన్ పరిధిలోని 11 ఏజెన్సీ మండలాల్లో ఈ ఏడాది ఇంటర్ పరీక్షల నిర్వహణకు 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం పాడేరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2, ఎపిటిడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో 1, అరకు వ్యాలీలో ఎపిటిడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో 2, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1, చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1, ఎపిటిడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో 1 కేంద్రాలను ఏర్పాటు చేయగా, కొయ్యూరు, ముంచంగిపుట్టు, జికె వీధి, అనంతగిరి, సీలేరు, జి.మాడుగుల,పెదబయలు, డుంబ్రిగూడ, హుకుంపేటలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.రంపచోడవరం డివిజన్ లో పరీక్షలకు 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నూతన పరీక్షా కేంద్రం మంజూరుడుంబ్రిగుడ:మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేందుకు పగడ్బందీగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమై సుమారు 22 ఏళ్ళకు ఈ ఏడాది పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని అధికారులు మంజూరు చేశారు. ఈ పరీక్ష కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 395, కేజీబీవీ కళాశాల నుంచి 74 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. గతంలో మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లేక పోవడంతో ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని అరకులోయకు కేటాయించేవారు. దీంతో ఇక్కడి అక్కడికి వెళ్లి పరీక్షలు రాసి వచ్చేవారు. ఇక్కడి నుంచి అరకుకు సుమారు 16 కిలోమీటర్లు ఉండటంతో విద్యార్థులు రోజువారీగా పరీక్ష కేంద్రానికి వెళ్లి రావడానికి సమయానికి వాహనాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇక్కడ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ు రవాణా కష్టాలు తప్పిందని విద్యార్థులు అంటున్నారు. హుకుంపేట:స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాడేరు సిఐ సన్యాసినాయుడు తరగతి గదులను పరశీలించారు. సౌకర్యాలపై ప్రిన్సిపల్ సింహాచలంను అడిగి తెలుసుకున్నారు. ఐదు రూముల్లో 367 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్ పాల్గొన్నారు.