న్యూఢిల్లీ : రెక్కలతో తయారు చేసిన ‘స్వదేశీ స్పేస్ షటిల్’గా పిలిచే పుష్పక్ శుక్రవారం ఉదయం విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో భారత్ మరో మైలురాయిని దాటింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఎటిఆర్)లో ఈ ప్రయోగం చేపట్టింది.
పరీక్షలో భాగంగా వైమానిక దళం హెలికాఫ్టర్ నుండి రాకెట్ను జారవిడిచిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ సోమనాథ్ తెలిపారు. 21వ శతాబ్దపు పుష్పక్ ప్రయోగ ఫలితాలు ‘అద్భుతమైనవి, ఖచ్చితమైనవి ‘ అని ఆయన అని పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో దేశ సాంకేతిక సామర్థ్యాలు విస్తృతమవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించవచ్చని అన్నారు.
భారత వైమానిక దళం చినూక్ హెలికాప్టర్లో ఆర్ఎల్విని 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టింది. రన్వే నుండి 4 కి.మీ దూరంల విడుదలైన తర్వాత, పుష్పక్ స్వయంగా క్రాస్ రేంజ్ కరెక్షన్లతో పాటు రన్వేపై ల్యాండ్ అయింది. బ్రేక్ పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ సాయంతో స్వయంగా ఆగినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.