న్యూఢిల్లీ : ఖతార్లో మరణశిక్ష విధించిన ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులను భారత రాయబారి గత ఆదివారం కలిసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాకి వివరించారు. డిసెంబర్ 3న జైలులో ఉన్న 8 మంది మాజీ నేవీ అధికారులను కలిసేందుకు మన రాయబారికి అనుమతి లభించిందని అన్నారు.
గత కొన్ని నెలలుగా ఖతార్ నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. మాజీ నేవీ అధికారులందరూ భారత నౌకాదళంలో 20 ఏళ్ల వరకు విశిష్ట సేవా రికార్డును కలిగి ఉన్నారు. శిక్షకులతో పాటు పలు కీలక పదవులను నిర్వహించారు. గూఢచర్యం ఆరోపణల కేసులో గతేడాది ఆగస్టులో వారిని అరెస్ట్ చేసింది. అయితే వారిపై ఉన్న ఆరోపణలను మాత్రం బహిరంగ పరచలేదు. వారి బెయిల్ పిటిషన్లను అనేకసార్లు తిరస్కరించింది.