లండన్ : డ్రగ్స్ దందాలో అరెస్టయిన భారత సంతతి భార్యాభర్తలు ఆరతీ ధీర్, కవల్ జిత్ సింహ్ రాయ్ జాదాలకు జాదాలకు లండన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సుదీర్ఘ విచారణ తర్వాత దోషులుగా తేల్చి తాజాగా శిక్ష ఖరారు చేసింది. ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో ఈ జంటను పోలీసులు 2021లో అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు హాన్ వెల్ లోని వారి నివాసంలో పోలీసులు సోదా చేయగా కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. దాదాపు రూ. 31 కోట్ల విలువైన యూరోలు నగదు రూపంలో దొరకగా.. రూ.8 కోట్ల విలువైన ఇల్లు, ఖరీదైన లాండ్ రోవర్ కారు, మొత్తం 22 బ్యాంకుల్లో డిపాజిట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఆరతీ, రాయ్ జాదాలపై మన దేశంలోనూ ఓ కేసు పెండింగ్ లో ఉంది. గుజరాత్ లో జరిగిన డబుల్ మర్డర్ వెనక ఈ జంట హస్తం ఉందని పోలీసులు కేసు పెట్టారు. భారత్లోని గుజరాత్లో ఒక బాలుడిని దత్తత తీసుకొని, అతడి పేరిట రూ.1.3 కోట్ల జీవితబీమా చేయించారు. ఈ బీమా సొమ్ము కోసం బాలుడిని, అతడి బావను హత్య చేయించారనే ఆరోపణ వీరిపై ఉంది. ఈ హత్యకేసులో ఆరతి, రారుజాదాలను తమకు అప్పగించాలని భారత్ కోరినా, మానవహక్కుల రక్షణ పేరిట బ్రిటన్ 2020 ఫిబ్రవరిలో ఆ వినతిని తోసిపుచ్చింది.