ఇస్లామాబాద్ : ఇప్పటికే జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ ను పోలీసులు మంగళవారం మరోసారి అరెస్టు చేశారు. సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్కు రిలీజ్ వారెంట్ జారీ అయ్యింది. ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే గత ఏడాది రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇమ్రాన్ఖాన్ను అరెస్టు చేశారు. ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మంగళవారం నాడు ఉగ్రవాద నిరోధక కోర్టు (ఎటిసి) సమన్లు జారీ చేసింది. భద్రతా కారణాల రీత్యా ఇమ్రాన్ఖాన్ను వీడియో లింక్ ద్వారా కోర్టు ముందు విచారణకు జైలు అధికారులు హజరుపర్చారు. అడియాలా జైలులో ఇమ్రాన్ఖాన్ను విచారించాలని జడ్జి పోలీసుల్ని ఆదేశించారు. సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్కు రిలీజ్ వారెంట్ను సోమవారం ప్రత్యేక కోర్టు జారీ చేసింది. అయితే అప్పటికి కూడా తోషఖ్మా, 190 మిలియన్ పౌండ్ల అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు.