ప్రజాశక్తి-కడప : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీపీ సంస్థ కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీపీ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో భారీగా కాంట్రాక్ట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేసీపీ సంస్థలపై ఐటీ దాడులు జరగడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. ప్రొద్దుటూరులోని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు కూడా కేసీ సంస్థే చేపడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని కేసీ పుల్లయ్య సంస్థల్లోనూ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇటీవలే ప్రొద్దుటూరులోని బంగారం దుకాణాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు మరవకముందే మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.