హోటల్‌ నిర్లక్ష్యం – నాసిరకం మయోనైజ్‌ తిని 17 మందికి అస్వస్థత

Jan 17,2024 09:09 #17, #hotel, #negligence, #people, #sickness

హైదరాబాద్‌ : నాసిరకం మయోనైజ్‌ తిని 17మంది అస్వస్థతకు గురైన ఘటన ఐదు రోజుల క్రితం జరిగింది. మొదట నలుగురు బాధితులుండగా.. మంగళవారానికి సంఖ్య 17కి పెరగడంతో స్థానికంగా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

వెన్నపూసలా కనిపించే మయోనైజ్‌.. అల్వాల్‌లోని గ్రిల్‌ హౌజ్‌ హౌటల్‌ నిర్లక్ష్యంతో విషంలా మారింది. షవర్మ అనే మాంసాహార వంటకంతో కలిపి మయోనైజ్‌ను ఆరగించిన వారు వాంతులు, విరేచనాలు, తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఐదు రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటనలో.. మొదట నలుగురు బాధితులుండగా.. మంగళవారానికి సంఖ్య 17కి పెరగడంతో స్థానికంగా పరిస్థితులు వేడెక్కాయి. బాధితులంతా కంటోన్మెంట్‌ జనరల్‌ ఆస్పత్రి, హర్ష ఆస్పత్రి, బోయిన్‌పల్లి, బాలనగర్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అంతా ఒకే రకమైన సమస్యతో బాధపడుతున్నారని, హర్ష ఆస్పత్రిలోని బాధితుల రక్తంలో హానికర సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారణ అయిందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.

అంతకంతకు పెరిగిన బాధితులు..

”అల్వాల్‌ లోతుకుంటలోని గ్రిల్‌ హౌజ్‌ హౌటల్‌లో ఈనెల 12న శుక్రవారం సాయంత్రం మయోనైజ్‌ (గుడ్డుతో తయారు చేసిన)తో కలిపి షవర్మను ఆరగించిన కొందరు వాంతులు, విరేచనాలతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. వారిని పరామర్శించి వైద్యులతో మాట్లాడా. బాధితుల రక్తపరీక్షల్లో సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. సోమవారానికి బాధితుల సంఖ్య పెరిగింది” అని జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా అధికారి (ఎఫ్‌ఎస్‌ఓ) లక్ష్మీకాంత్‌ తెలిపారు.

ఎందుకు విషంలా మారుతోంది ?

మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌ల పై మయోనైజ్‌ను రాసుకుని తింటారు. సాధారణంగా.. గుడ్డులోని పచ్చసొన, నిమ్మ రసం, నూనెతో దీన్ని తయారుచేస్తారు. ఈ క్రమంలో.. చాలామంది శుభ్రతను పాటించట్లేదు. కొందరు గుడ్లు శుభ్రం చేయకుండా.. అపరిశుభ్రతతో తయారు చేస్తారు. దాన్ని తింటే అనారోగ్యం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శుభ్రంగా తయారైన మయోనైజ్‌ను కూడా నాలుగు గంటల్లోపు వాడేయాలని, అంతకు మించి నిల్వ ఉంచిన కోడిగుడ్డు మయోనైజ్‌ విషంలా మారొచ్చని ఎఫ్‌ఎస్‌ఓ లక్ష్మీకాంత్‌ వివరించారు. జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌రెడ్డిని వివరణ కోరగా.. మయోనైజ్‌తో చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని, ప్రతినెలా ఒకట్రెండు ఫిర్యాదులు నమోదవుతున్నాయన్నారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నిర్లక్ష్య హౌటళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు.

గ్రిల్‌హౌజ్‌ హౌటల్‌ నిర్వాహకుడి అరెస్టు

జవహర్‌నగర్‌, అల్వాల్‌: అల్వాల్‌లోని ఓ హౌటల్‌లో షవర్మా తిని అస్వస్థతకు గురైన ఘటనలో బాధితులకు సంఖ్య 17కు చేరింది. ఘటన వివరాలను అల్వాల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌దేవ్‌ వెల్లడించారు. లోతుకుంట పరిధిలోని గ్రిల్‌హౌజ్‌ హౌటల్‌లో ఈనెల 13న నలుగురు షవర్మా తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. 13 మంది బాధితులు కంటోన్మెంట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురు సుచిత్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు వైద్య నివేదిక ఆధారంగా బాధితులు కలుషిత ఆహారంతోనే అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గ్రిల్‌హౌజ్‌ హౌటల్‌ నిర్వాహకుడు తౌఫిక్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధితులను అల్వాల్‌ కార్పొరేటర్‌ విజయశాంతి జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరామర్శించారు.

➡️