ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : డిస్నీలాండ్ స్థలంలో కబేళ ఏర్పాటు నిలిపివేసి, ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుడవేరు రైలు బ్రిడ్జి కింద రోడ్లు నిర్మించి లైట్లు వేయించాలని కోరుతూ రాజరాజేశ్వరిపేటలో పేదలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న బాబూరావు మాట్లాడుతూ.. రాజరాజేశ్వరిపేటలోని అరుణోదయనగర్లో గల పేదల ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. బుడవేరు రైలు బ్రిడ్జి కింద రోడ్లు నిర్మించి లైట్లు వేయించాలన్నారు. ఇళ్లపై నుంచి వెళ్తున్న కరెంటు తీగలను ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్చాలని కోరారు. చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులను గెలిపించుకోవాలని సూచించారు. సిపిఎం కార్మిక సంఘాలు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు నిరసన దీక్షకు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు టి కాశీనాథ్ సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణ రావు, సెంట్రల్ సిటీ అధ్యక్షులు కే దుర్గారావు, 57 డివిజన్ సిపిఎం సేవ సభ్యులు టి శ్రీనివాస్ సాయి, సిఐటియూ నాయకులు రాము, కే దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.