- పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి 26 ఏళ్ల యశస్వినిరెడ్డి విజయం సాధించి చరిత్రను సృష్టించారు. సమీప ప్రత్యర్థి, బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై అనూహ్యంగా బరిలోకి దిగి తొలి ఎన్నికలోనే సత్తా చాటారు. పాలకుర్తి నియోజకవర్గం గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండాను మొట్టమొదటిసారిగా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఝాన్సీ రెడ్డి టికెట్టు ఆశించగా.. భారత పౌరసత్వం రాకపోవడంతో ఆమె కోడలు యశస్విని రెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం చేయించారు. కాగా, 2018లో బిటెక్ పూర్తి చేసిన యశస్విని రెడ్డి.. వివాహం అనంతరం అమెరికా వెళ్లిపోయారు. అక్కడ కొంతకాలం రియల్ఎస్టేట్ సంస్థలో పనిచేశారు. అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు.