రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు..!- హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

ప్రజాశక్తి-హిందూపురం :రాజధాని రైతులను నిలువున మోసం చేయడమే కాకుండా… రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేసిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఆయన ఆదివారం పర్యటించారు. అనంతరం తన నివాసంలో బిజెపి, జనసేన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురంలో ఎన్‌డిఎ కూటమి జెండా రెపరెపలాడేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. వైసిపి ఆగడాలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేస్తే వైసిపి ప్రభుత్వం ఇంటికి వెళ్లక తప్పదని పేర్కొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రోత్సాహం, ఓటర్ల ఆశీర్వాదంతో త్వరలో జరగబోయే ఎన్నికల్లో మూడోసారి తాను హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందుతానని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హిందూపురం కూటమి పార్లమెంట్‌ అభ్యర్థి బికె.పార్థసారథి, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్‌, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

➡️