కాకినాడలో వారసత్వ సంపదను రక్షించుకోవాలి

Feb 1,2024 15:26 #Kakinada
  • పురాతన కట్టడాలను కాపాడుకోవాలి
  • నగరానికి పొంచి ఉన్న పర్యావరణ ముప్పు
  • రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ వెల్లడి

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరంలో ఉన్న పురాతన సంపదను రక్షించుకోవాలని, అలాగే పురాతన కట్టడాలను కాపాడుకోవాలని, కరువు, వరదలు నివారణ ప్రపంచ ప్రజా కమిషన్ చైర్మన్ రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ వెల్లడించారు. కాకినాడ నగరం ప్రస్తుతం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్లో వారసత్వ సంపద సంరక్షణపై చర్చను పిడబ్ల్యూసిడిఎఫ్ కో- ఆర్డినేటర్ ప్రెసింగి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ వారసత్వ సంపద సంరక్షణపై రాజేంద్ర సింగ్ విలేకరులకు వివరాలను వెల్లడించారు. కాకినాడలోని వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద సమాజం మొత్తానికి చెందుతుందని వీటిని పరిరక్షించుకొని భవిష్యత్ తరాలకు అందజేయాలన్నారు. వారసత్వ సంపదలో పకృతి వనరులు, మడ అడవులు, హోప్ ఐలాండ్, తూర్పు తీర ప్రాంతం పర్యావరణం అన్నీ కూడా భాగమేనని ఆ సంపద ప్రజల ఆస్తి అని చెప్పారు. కాకినాడలోని చారిత్రాత్మక గల ఎంఎస్ఎన్ చారిటీస్ భూములను, ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తున్నారని అది తనకు చాలా బాధాకరంగా ఉందన్నారు. పూర్వ కట్టడాలను ఆస్తులను కాపాడవలసిన వారే వాటిని అన్యాక్రాంత పరుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలో ఉన్న ఎంఎస్ఎన్ చారిటీస్, పెద్ద మార్కెట్, పిఆర్ కళాశాల, మెక్లారిన్ పాఠశాల, కోస్తా తీర ప్రాంతాలను కాపాడుకోవాలంటూ హితవు పలికారు. కొన్ని ట్రస్టులు ఆయా సంపదకు రక్షణగా నిలుస్తున్నాయని, కానీ ఆ ఆస్తులు కాపాడవలసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వీర్యం చేస్తుందంటూ చెప్పారు. పౌర సమాజం బలంగా ఉంటేనే వారసత్వ సంపద, పురాతన కట్టడాలను కాపాడుకోవచ్చని అలాగే పేదరికం నుండి పేదలను విముక్తి కలిగించాల్సిన ట్రస్టులే పేదరికంలోకి కూరుకుపోతున్నాయంటూ రాజేంద్ర సింగ్ చెప్పారు. రాజేంద్ర సింగ్ హిందీలో చేసిన వ్యాఖ్యలను పర్యావరణ సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తెలుగులోకి అనువదించారు. అంతకుముందు వారసత్వ సంపద సంరక్షణపై కాకినాడకు చెందిన పలువురు నుండి సలహాలు సూచనలు తీసుకొని వాటిపై చర్చించారు.
ఈ చర్చ కార్యక్రమంలో జేఎన్టీయూ కె ప్రొఫెసర్లు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, సామాజికవేత్తలు చిక్కాల దొరబాబు, పి శివశంకర్, టీకే విశ్వేశ్వర్ రెడ్డి, కే మృత్యుంజయరావు, ఐ దోసగిరిరావు, గూడూరు వెంకటేశ్వరరావు, వక్కలంక రామకృష్ణ, చిక్కాల అబ్బు నందమూరి వినోద్, ఉద్దండ రాజ్యలక్ష్మి, జి సత్యమూర్తి, మల్లాడి రాజు, పప్పు దుర్గా రమేష్, ఎండి జవహర్ ఆలీ, కిషోర్ కుమార్, దూసర్లపూడి రమణ రాజు, విబిఎల్ఎన్ మూర్తి, బీవీ రమణమూర్తి, వైదాడి నూక రాజు, కొప్పనాతి శ్రీనివాసరావు, ఆకుల ప్రవీణ్, ఏపీజే విను, పోలసపల్లి సరోజ, పెద్దింశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఉన్న వారసత్వ సంపదను పురాతన కట్టడాలను రక్షించేందుకు కలసికట్టుగా పయనించాలని తీర్మానించారు. అలాగే కాకినాడ చరిత్రకు సంబంధించి వారి దగ్గర ఉన్న బుక్లెట్లను పలువురు రాజేంద్ర సింగ్కు అందించారు.

➡️