రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల మధ్య .. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ( ఈడి)కి ఆయన షాకిచ్చారు. ఎస్సి,ఎస్టి వేధింపుల నిరోధక చట్టం కింద ఈడిపై కేసు నమోదుచేశారు. సోమవారం న్యూఢిల్లీలోని సోరెన్ నివాసంపై దాడికి సంబంధించి ఈ కేసు నమోదైనట్లు సమాచారం. తనను వేధించడమే ఈడి లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాంచీలోని ఎస్సి/ఎస్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం మధ్యాహ్నం భారీ భద్రత మధ్య రాంచీలోని సోరెన్ నివాసానికి చేరుకున్న ఈడి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. అయితే సోరెన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎస్టికి చెందిన హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2020 నుండి 2022 మధ్యకాలంలో నకిలీ పత్రాలను సృష్టించి గిరిజనుల భూమిని కొనుగోలు చేసి, విక్రయించినట్లు సోరెన్పై ఈడి అభియోగాలు మోపింది. గత మూడు రోజుల నుండి ఢిల్లీ, రాంచీల్లోని ఆయన నివాసాల్లో ఈడి సోదాలు చేపడుతోంది. ఢిల్లీ నివాసం నుండి రూ.36 లక్షల నగదు, ఎస్యువి, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన సోరెన్ మంగళవారం రాంచీ నివాసానికి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి రాంచీలోని తన అధికారిక నివాసంలో తనను విచారించుకోవచ్చని ఇడి అధికారులకు మెయిల్ కూడా చేశారు.