గుజరాత్‌ ఆల్‌రౌండ్‌ షో

Apr 1,2024 08:40 #All Round Show, #Gujarat, #Sports

ఐపిఎల్‌ 2024లో గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చిత్తుగా ఓడింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లో అదరగొట్టిన అతిథ్య జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌ రౌండ్‌ షోతో సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

– ఓడిన సన్‌రైజర్స్

అహ్మదాబాద్‌ : ఐపిఎల్‌ 2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరాజయంపాలైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లో అదరగొట్టిన అతిథ్య జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌ రౌండ్‌ షోతో సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హైదరాబాద్‌ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ సునాయసంగా చేధించింది. ఆ జట్టు బ్యాటర్లు సాయి సుదర్శన్‌ (44), డేవిడ్‌ మిల్లర్‌ (44), శుభ్‌మన్‌ గిల్‌ (36) చెలరేగారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 277 పరుగుల భారీ స్కోర్‌ సాధించిన హైదరాబాద్‌ బ్యాటర్లు ఈసారి మాత్రం తేలిపోయారు. గుజరాత్‌ బౌలర్లు కట్టడి చేయడంతో సన్‌రైజర్స్‌ 162/8 పరుగులు మాత్రమే చేసింది. బౌలర్‌ మోహిత్‌ శర్మ (3/25) హైదరాబాద్‌ను కట్టడి చేశాడు. ఈ సీజన్లో గుజరాత్‌కు ఇది రెండో విజయం.
163 పరుగుల మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌ వేసిన ఐదో ఓవర్లో వృద్ధిమాన్‌ సాహా వికెట్‌ కోల్పోయింది. ధాటిగా ఆడిన సాహా ఒక ఫోర్‌, 2 సిక్సులతో 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అనంతరం సాయి సుదర్శన్‌తో కలిసి మరో ఓపెనర్‌ గిల్‌ రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. అయితే 2 ఫోర్లు, ఒక సిక్సుతో 28 బంతుల్లో 36 పరుగులు చేసిన గిల్‌ను మరో స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే 10వ ఓవర్‌లో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 74 పరుగులకు గుజరాత్‌ 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం సాయి సుదర్శన్‌, మిల్లర్‌ కలిసి మూడో వికెట్‌కు 64 పరుగుల హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే హాఫ్‌ సెంచరీకి చేరువ అవుతున్న సాయి సుదర్శన్‌ను 17వ ఓవర్లో పాట్‌ కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. 36 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్‌ 4 ఫోర్లు, ఒక సిక్సుతో 45 పరుగులు చేశాడు. దీంతో 138 పరుగుల వద్ద గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం మిల్లర్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. విజరు శంకర్‌తో కలిసి మిల్లర్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చివరి ఓవర్‌ మొదటి బంతిని సిక్సు కొట్టి మిల్లర్‌ జట్టును గెలిపించాడు. దీంతో సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ ఘనవిజయం సాధించింది. 4 ఫోర్లు, 2 సిక్సులతో 27 బంతుల్లో 44 పరుగులు చేసిన మిల్లర్‌.. 11 బంతుల్లో 14 పరుగులు చేసిన విజరు శంకర్‌ నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్‌ బౌలర్లలో పాట్‌ కమిన్స్‌, షాబాజ్‌ అహ్మద్‌, మయాంక్‌ మార్కండే తలో వికెట్‌ తీశారు.

సన్‌రైజర్స్‌ను దెబ్బ తీసిన అప్ఘాన్‌ బౌలర్లు
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అజ్మతుల్లా ఒమర్జారు వేసిన ఐదో ఓవర్‌లో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(16) వికెట్‌ కోల్పోయింది. కాసేపటి తర్వాత మరో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(19)ను స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో 58 పరుగులకు హైదరాబాద్‌ జట్టు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అనంతరం మాక్రమ్‌తో కలిసి అభిషేక్‌ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే అభిషేక్‌ శర్మను 10వ ఓవర్‌లో సీనియర్‌ మోహిత్‌ శర్మ ఔట్‌ చేశాడు. 2 ఫోర్లు, 2 సిక్సులతో 20 బంతుల్లో అభిషేక్‌ శర్మ 29 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్లాసెన్‌ తన ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. ఈ క్రమంలో మాక్రమ్‌తో కలిసి జట్టు స్కోర్‌ను 100 పరుగులు దాటించాడు. అయితే ధాటిగా ఆడుతున్న క్లాసెన్‌ను 14వ ఓవర్‌లో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఒక ఫోర్‌, 2 సిక్సులతో క్లాసెన్‌ 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌ కీలక బ్యాటర్లైనా మయాంక్‌ అగర్వాల్‌, ట్రావిస్‌ హెడ్‌, క్లాసెన్‌ను అఫ్ఘానిస్థాన్‌ బౌలర్లు అజ్మతుల్లా ఒమర్జారు, నూర్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్‌ తీయడం గమనార్హం.

ఆదుకున్న సమద్‌, షాబాజ్‌
ఆ తర్వాతి ఓవర్‌లోనే మాక్రమ్‌(17)ను ఉమేష్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. రషీద్‌ ఖాన్‌ సూపర్‌ క్యాచ్‌తో మాక్రమ్‌ ఔట్‌ అయ్యాడు. దీంతో 114 పరుగులకే సన్‌రైజర్స్‌ సగం వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో సన్‌రైజర్స్‌ను షాబాజ్‌ అహ్మద్‌, అబ్దుల్‌ సమద్‌ ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 28 బంతుల్లో 45 పరుగులు జోడించార్నె. దీంతో సన్‌రైజర్స్‌ స్కోర్‌ 150 పరుగులు దాటింది. ధాటిగా ఆడిన సమద్‌ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో షాబాజ్‌ అహ్మద్‌(22), వాషింగ్టన్‌ సుందర్‌ను మోహిత్‌ శర్మ వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. సుందర్‌ డకౌట్‌ అయ్యాడు. 3 ఫోర్లు, ఒక సిక్సులతో 15 బంతుల్లో 30 పరుగులు చేసిన అబ్దుల్‌ సమద్‌ ఇన్నింగ్స్‌ చివరి బంతికి రనౌట్‌ అయ్యాడు. దీంతో చివరి ఓవర్లో 3 పరుగులు మాత్రమే రాగా 3 వికెట్లు పడ్డాయి. గుజరాత్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ 3 వికెట్లతో చెలరేగాడు.

➡️