ప్రజాశక్తి- కోటబొమ్మాళి (శ్రీకాకుళం జిల్లా) : మనవరాలిపై తాత పైశాచికత్వానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని కొత్తపేటకు చెందిన తండ్రీ కొడుకులు ఓ కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇద్దరూ వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. ఈ నెల 19న బాలికను తన తండ్రి ప్రసాద్ ఇంటి వద్ద వదిలివెళ్లాడు. సాయంత్రం వచ్చి పాపని తీసుకొని వెళ్లిపోయాడు. 20న ఉదయం బాలికకు స్నానం చేయించే క్రమంలో రక్తపు మరకలను తల్లి గుర్తించి నిలదీసింది. జరిగిన విషయాన్ని బాలిక తల్లికి చెప్పింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని మిన్నకుండిపోయారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ఫోన్ చేసి విషయం చెప్పారు. బాలికను టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చేర్పించి స్థానిక పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.