ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ ఖాజానా నుంచి వేతనం తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులందరికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై కేబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి వేతనాలు పొందుతున్న రాష్ట్రంలోని 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తింపజేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారులకు సంబంధించి కమిషన్కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా వారు రాజకీయ ప్రచారం చేస్తున్నారని, ప్రతిపక్షాలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారని కమిషన్ గుర్తించినట్లు పేర్కొంది. కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, చట్టానికి లోబడి కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.