ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రిత్విక్ రంజనం పాండేను కమిషన్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 16వ ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టిఒఆర్)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం గత నెలలో ఆమోదించింది. ఐదేళ్ల కాలానికి (2026-27 నుంచి 2030-31) సంబంధించిన రిపోర్టును 2025 అక్టోబరు 31లోగా రాష్ట్రపతికి కమిషన్ సమర్పించాల్సి ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయం పెంపుదలకు సంబంధించిన చర్యలను ఆర్థిక సంఘం సూచిస్తుంది. ఫైనాన్సింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లపై కూడా సమీక్ష జరుపుతుంది. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సలహాలు ఇచ్చే రాజ్యాంగ వ్యవస్థగా ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చిన నీతి ఆయోగ్కు తొలి ఛైర్మన్గా అరవింద్ పనగరియాను 2015లో మోడీ సర్కారు నియమించింది. పనగరియా న్యూయార్క్లోని కొలంబియా వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేయడంతోపాటు ఎడిబి, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యుటిఒలో వివిధ హోదాల్లో పనిచేశారు.