యుపి : బందా జైల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్, మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ (60) గుండెపోటుతో మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి విషమించి గుండెపోటుతో అన్సారీ మృతి చెందినట్టు అధికార వర్గాలు గురువారం ప్రకటించాయి. గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అంతకుమునుపు మంగళవారం అన్సారీ అనారోగ్యం పాలయ్యారు. కడుపులో నొప్పి వస్తోందని అతడు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రికి తరలించారు. రంజాన్ ఉపవాసం తరువాత అతడి ఆరోగ్య పరిస్థితి విషమించి అతడు మరణించినట్టు బందా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు.
అన్సారీ మృతికి సంబంధించి అధికారులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. ”యూపీ లోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం సాయంత్రం 8.25 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో జైలు అధికారులు ఆయనను దుర్గావతి మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ గుండెపోటుతో ఆయన చనిపోయారు” అని బులెటిన్లో పేర్కొన్నారు. అయితే అన్సారీ కుమారుడు ఉమర్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. తన తండ్రికి జైల్లో ఆహారంలో విషం పెట్టి అంతమొందించారని ఆరోపించారు. ఈ విషయమై కోర్టు కెళతామని అన్నాడు. తండ్రికి సంబంధించి జైలు నుంచి ఎలావంటి సమాచారం రాలేదని, మీడియా ద్వారానే జరిగింది తెలిసిందని పేర్కొన్నాడు. అన్సారీకి జైలులో విషపూరిత ఆహారం ఇచ్చారని ఇటీవలే ఆయన సోదరుడు, ఘాజీపుర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు.
యుపిలో 144 సెక్షన్ ….
అన్సారీ మృతితో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్లో 144 సెక్షన్ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్ రిజర్వ్ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
అన్సారీపై 61 కేసులు
యూపీలోని మౌకు చెందిన అన్సారీపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990లో సొంతంగా గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్యాంగ్ మౌ, ఘాజీపుర్, వారణాసి ప్రాంతాల్లో దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడటంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. బిజెపి ఎమ్మెల్యే కృష్ణానంద్ రారు హత్య కేసులో గతేడాది ఏప్రిల్లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ రెండు సార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఆయన మఅతికి ఆ పార్టీ ఎక్స్(ట్విటర్)లో సంతాపం ప్రకటించింది.