సాపూర్ అనే గ్రామంలో ఒక అందమైన బడి ఉంది. ఆ బడిలో సత్య, గోపాల్, రిత్విక్, హర్ష అనే నలుగురు స్నేహితులు ఉన్నారు. సత్యకి ఆటలంటే చాలా ఇష్టం. ఫుట్బాల్ అంటే ఇంకా ఇష్టం. ఒకరోజు, గోపాల్తో కలిసి ఆడాడు. ఆటలో గోపాల్ గెలవలేకపోయాడు. పైగా సత్య గెలవడం తట్టుకోలేకపోయాడు. ఇదివరకులా సత్యతో స్నేహంగా ఉండడం లేదు. గోపాల్ తనను దూరం పెడుతున్నాడని తెలిసి సత్య చాలా బాధపడ్డాడు. ఈ విషయం రిత్విక్, హర్షతో చెప్పాడు.
గోపాల్లో ఎలాగైనా మార్పు తేవాలని మిత్రులిద్దరూ అనుకున్నారు. ఒకసారి గోపాల్, రుత్విక్కి ఒక స్కేల్ ఇచ్చాడు. ఎన్నిరోజులైనా తిరిగి ఇవ్వలేదు. అప్పుడు హర్ష వచ్చి, ‘గోపాల్, నువ్వు రిత్విక్కి స్కేల్ ఇచ్చావ్ కదా దాన్ని సత్యకు ఇచ్చాడట. సత్య ఏమో నీ స్కేల్ విరగ్గొట్టేసాడు’ అని చెప్పాడు. గోపాల్ అది నిజమా కాదా అని ఆలోచించకుండా సత్యని తిట్టాడు. స్కేలు ఖరీదు ఇవ్వమని నిలదీసాడు. గోపాల్తో వైరం ఎందుకని, సత్య డబ్బులు, ఓ కొత్త స్కేల్ ఇచ్చాడు. ‘గోపాల్ నువ్వు ఈమధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఇప్పుడేమో స్కేలు తీసుకున్నానని అంటున్నావు. అసలా స్కేల్ విషయమే నాకు తెలియదు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నువ్వు అడిగావని కొత్త స్కేలు ఇచ్చాను’ అని చెప్పాడు. అప్పుడే అక్కడికి హర్ష, రిత్విక్ వచ్చి, ‘చూశావా గోపాల్, సత్యకి నీమీద ఎంత ప్రేమో.. తనకు సంబంధం లేని విషయమైనా, నువ్వు బాధపడకూడదని అవన్నీ ఇచ్చాడు. స్నేహితులంటే ఇలాగే ఉండాలి. గెలిచినా, ఓడినా అండగా ఉండాలి. అది నీకు తెలియజేయాలనే మేము ఈ నాటకం ఆడాం. సత్యకు కూడా ఈ విషయం తెలియదు. ఈ రకంగానైనా మీ ఇద్దరు మాట్లాడుకుంటారని, మీ మధ్య ఏర్పడ్డ పొరపొచ్చాలు పోతాయని ఇలా చేశాం’ అని చెప్పారు. గోపాల్ జరిగిందంతా తెలుసుకుని, సత్యకి సారీ చెప్పాడు. అలా స్నేహితులంతా మళ్లీ ఒక్కటైపోయారు.