మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు వ్యక్తులు అదృశ్యం

Jan 11,2024 12:05 #firing, #Manipur

ఇంఫాల్‌   :   మణిపూర్‌లో బుధవారం మరోసారి కాల్పులు చెలరేగాయి. బిష్ణుపూర్‌ జిల్లాలోని హౌటక్‌ గ్రామంలో ఉగ్రవాదులు తుపాకీ, బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని వారిపై కాల్పులు జరిపాయని  అధికారులు తెలిపారు.  ఉగ్రవాదుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోందని చెప్పారు. దీంతో సుమారు 100 మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారని అధికారులు తెలిపారు.

అదే సమయంలో మణిపూర్‌లోని కుంబి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. బిష్ణుపూర్‌, చురచంద్‌పూర్‌ జిల్లాలను ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో కట్టెలు సేకరించడానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ తెలియరాలేదు.  వారిని దారాసింగ్‌, ఇబోమ్చా సింగ్‌, రోమెన్‌ సింగ్‌, ఆనంద్‌ సింగ్‌లుగా గుర్తించామని అన్నారు. వారిని ఉగ్రవాదులు అపహరించే అవకాశం ఉందని, కేంద్ర బలగాల సాయం కోరామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

➡️