- నలుగురు మావోయిస్టులు మృతి
ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మంగళవారం భద్రతా దళాలకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం… గడ్చిరోలి జిల్లా రేపనపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కోలామారక దండకారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సి-60 కమాండోలకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ డివిసి సభ్యులు వర్గీస్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కుర్సం రాజు, వెంకటేష్ మృతి చెందారు. వీరిలో వర్గీస్ తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యునిగా, మంగాతు చెన్నూరు ఏరియా కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారని, ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.