జలౌన్ : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి పికప్ వాహనాన్ని, ట్రక్కు ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. చనిపోయినవారిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి, టీనేజ్ అమ్మాయి ఉన్నారని పోలీసులు సోమవారం తెలిపారు. ఈ ఘటన జలౌన్ జిల్లాలో, ఒరారు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహనా గ్రామానికి చెందిన సుమారు 30 మంది ఆదివారం ఉదయం ఓర్చా, డాటియాకు విహారయాత్రకు వెళ్లి ఆదివారం రాత్రి తిరిగి ఇంటికి వస్తున్నారు. అర్థరాత్రి కైథారి టోల్ప్లాజా వద్దకు చేరుకున్న పికప్ వాహనాన్ని వేగంగా వచ్చి ట్రక్కు ఢకొీట్టింది. దీంతో పికప్ వాహనం పక్కకు బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని గాయపడిన వారిని అంబులెన్స్లో ఒరారులోని మెడికల్ కాలేజీ, జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన చోటుకి పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ఇరాజ్ రాజా, ఇతర అధికారులు వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఇరాజ్ అధికారులను ఆదేశించారు. కాగా ఈ ఘటనలో మృతి చెందినవారి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్యం అందేలా చూడాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.