ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెం జెడ్పి హైస్కూలుకు చెందిన ఐదుగురు పదో తరగతి విద్యార్థులు విహారయాత్ర కోసమని అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం సమీపంలో ఉన్న సీతపల్లి వాగు వద్దకు వచ్చారు. వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి కాకర వీర వెంకట అర్జున్ (16), అండిబోయిన దేవి చరణ్ (16), లావేటి రామన్ (16) చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ధర్మారావుపేటకు చెందిన అద్దేపల్లి చందు (17), తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాళ్లపూడికి చెందిన గగన్ సందేశ్ (12) సరిపల్లి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తూ కోమటికుంట వద్ద కాలుజారి బోదెలో పడి మరణించారు.