ప్రజాశక్తి – యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా):దివీస్ పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేసిన పైప్ లైన్లు తొలగించాలని కోరుతూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలోని కొనపాపపేట బీచ్ వద్ద మత్స్యకారులు బుధవారం ధర్నా చేశారు. బీచ్ రోడ్డులో టెంట్లు వేసి బైఠాయించారు. రాజకీయ పార్టీలకతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకారులు పాల్గన్నారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మాట్లాడుతూ.. తొండంగి మండలంలో ఏర్పాటు చేసిన దివీస్ ఫ్యాక్టరీ వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు పైప్ లైను వేశారని తెలిపారు. దీంతో చేపల వేట కోసం వెళ్లిన సమయంలో వలలు, బోట్లు పైపులైన్లకు తగిలి పాడైపోతున్నాయని, దీని వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పైపులైన్ల వల్ల సముద్రంలో మత్స్య సంపద చెదిరిపోతోందని, తక్షణమే పైపులైన్ తొలగించాలని డిమాండ్ చేశారు. బీచ్ రోడ్డులో మత్స్యకారుల ఆందోళనతో ఉప్పాడ నుంచి అద్దరపేట వరకు వాహనాలు నిలిచిపోయాయి.