రాజస్థాన్‌ జైసల్మేర్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స విమానం

Mar 12,2024 18:16 #Crash, #Rajasthan, #Tejas Fighter Jet

జైసల్మేర్‌ : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలింది. జైసల్మేర్‌లోని లక్ష్మీ చంద్‌ సన్వాల్‌ కాలనీలికి సమీపంలో ఓ స్టూడెంట్‌ హాస్టల్‌ గ్రౌండ్‌లో ఆ విమాన శకలాలు పడ్డాయి. దీంతో ఆ ప్రదేశంలో ఆ శకలాల నుంచి భారీస్థాయిలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. ఈ కూలిన విమానం భారతీయ వైమానిక దళానికి చెందిన లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తేజస్‌ అని సమాచారం. శిక్షణ జరుగుతున్న సమయంలో ఈ విమానం కూలింది. ఈ ఘటనలో పైలట్‌కి ఎలాంటి గాయాలు కాలేదు. సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఈ ఘటనపై వైమానికదళం విచారణకు ఆదేశించింది.

కాగా, 23 ఏళ్ల తర్వాత స్వదేశీ జెట్‌ విమానం కూలిపోవడం ఇదే తొలిసారి. 2001లో ఒకసారి కూలిపోయింది. తేలికపాటి యుద్ధ విమానం అయిన తేజస్‌ 2016లో భారత వైమానిక దళంలోకి ప్రవేశించింది.

➡️