ఒంటరిగానే పోటీ చేస్తాం : ఫరూక్‌ అబ్దుల్లా

Feb 15,2024 16:59 #Farooq Abdullah, #Lok Sabha polls

 శ్రీనగర్‌ :    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీట్ల పంపకానికి సంబంధించినంతవరకు, ఎన్‌సి ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. క్రికెట్‌ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఫరూక్‌ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

జమ్ముకాశ్మీర్‌ ఎన్నికలపై మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. పార్లమెంటరీ ఎన్నికలతో పాటే రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతాయని తాను భావిస్తున్నానని అన్నారు. కాగా, ప్రతిపక్ష కూటమి ‘ఇండియా ఫోరం’ నిర్వహించిన అన్ని సమావేశాల్లోనూ ఫరూక్‌ అబ్దుల్లా పాల్గన్నారు. సీట్ల ఒప్పందం చర్చపై ఏకాభిప్రాయానికి రాకపోవడంపై గత నెల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

➡️