అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

Jan 31,2024 16:43 #srikakulam
family attempt suicide

ప్రజాశక్తి – రణస్థలం రూరల్‌ : అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీరుపాలెంకు చెందిన మత్స్యకారుడు సీకోటి నాగరాజు, ఆయన భార్య సంధ్య, కుమార్తె భవానీ(7), కుమారుడు రాజు, అత్త లక్ష్మి మంగళవారం రాత్రి భోజనం చేసి పడుకున్నారు. బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో నాగరాజు చేపల వేటకు వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటలైనా తలుపులు తీయకపోవడంతో పక్క ఇంటి వాళ్లు తలుపులు తట్టారు. దీంతో కుమారుడు రాజు నిద్రలేచినా సంధ్య, లక్ష్మి, భవానీ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే స్థానికులు వారిని పాతర్లపల్లి పిహెచ్‌సికి తరలించారు. అప్పటికే భవానీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంధ్య, లక్ష్మిని మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. సిఐ జి.రామచంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంధ్య, లక్ష్మి స్పృహలోకి రావడంతో పోలీసులు వారి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. ఆలౌట్‌ పెట్టి పడుకున్నామని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలీదని సంధ్య తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే వాస్తవం తెలుస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఎస్‌ఐ జి.రాజేష్‌ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

➡️