విశాఖపట్నం: ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఎసిఎ) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసి)కి దరఖాస్తు చేసుకున్నాడు. గురువారం విహారికి ఎసిఎ షోకాజ్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో విహారి తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రంజీట్రోఫీ మధ్యలో అర్ధాంతరంగా కెప్టెన్సీ పదవినుంచి తొలగించడంపై అప్పుడే ఎసిఎకు విహారి లేఖ రాశాడని తెలిసింది. దానికి సమాధానంగా ఎసిఎ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆ లేఖపై చర్చ నడిచినట్లు.. దానిపై అప్పుడే వివరణ కూడా ఇచ్చినట్లు ఎసిఎ వాదన. కానీ సోషల్ మీడియా వేదికగా విహారి రంజీట్రోఫీ సీజన్ ముగిసిన తర్వాత సమస్యను మరింత జఠిలం చేసేలా ప్రకటనలు చేశారని, ఇది సరైన చర్య కాదని ఎసిఎ ఇటీవల విహారికి షోకాజ్ నోటీసు జారీచేసింది. ఇక 2023-24 రంజీ సీజన్కు ముందు విహారి ఆంధ్ర నుంచి మధ్యప్రదేశ్ తరఫున ఆడాలనే ఉద్దేశ్యంతో ఎన్ఓసికి దరఖాస్తు చేసుకున్నా.. ఎసిఎ అనుమతించలేదని తెలిసింది.