ప్రజాశక్తి-విజయనగరం కోట: మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అసిస్టెంట్ కలెక్టర్ సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని దాసన్నపేట రైతు బజార్ జంక్షన్, గాంధీ బొమ్మ జంక్షన్, కలెక్టరేట్ జంక్షన్ వద్ద విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించి, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. హుషారైన పాటలకు నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ త్రివినాగ్ సైతం విద్యార్థులతో కలిసి నత్యం చేసి ఉత్సాహపరిచారు. క్ష్మిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన భవిష్యత్తును నిర్ణయించే ఓటును చాలా ఆలోచించి సరైన వ్యక్తికి, స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికలు అన్నవి ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పండుగ లాంటివని, ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరావు, రీసోర్స్పర్సన్ పద్మనాభం, హౌసింగ్ అధికారులు, సిబ్బంది, ఆర్.కె డ్యాన్స్ అకాడమి విద్యార్థులు పాల్గొన్నారు.