ప్రజాశక్తి-తెనాలి : టిడిపి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఆలపాటి తెనాలి టికెట్ ఆశించినా పొత్తులో టిక్కెట్ దక్కలేదు. జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ను ప్రకటించడంతో ఆలపాటి తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా అతనితో మాట్లాడటంతో కొంత మెత్తబడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు-2 గాని, కృష్ణాజిల్లా పెనమలూరు నుంచి అవకాశం దొరుకుతుందని ఎదురు చూశారు. చివరిగా ఆ రెండు స్థానాల్లో పోటీకి అవకాశం కూడా కోల్పోవడంతో తిరుగుబాటు ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమాలోచనలతో ఉన్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆయన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను ప్రకటించునున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేదా మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటుందా అన్నది ఆయనే వెల్లడించాల్సి ఉంది. ఏదిఏమైనా ఆలపాటి రియాక్షన్ నియోజకవర్గంలో ఏలాంటి ప్రభావాన్ని చూపుతుదోనన్న ఉత్కంఠ ఓటర్లలో నెలకొంది.