— ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ
ప్రజాశక్తి -నెల్లూరు : నగరవ్యాప్తంగా ప్రధాన రోడ్లమీద వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని, వాటిని గోశాలకు తరలిస్తామని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. పశువులను గోశాలకు తరలించే స్పెషల్ డ్రైవ్ లో భాగంగా స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం, వాకర్స్ రోడ్డు, మూలాపేట తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్న పశువులను కల్లూరుపల్లి గోశాలకు మంగళవారం తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ వాహన ప్రమాదాలకు కారణభూతమవుతున్న రోడ్లపై సంచరించే పశువులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పశువులను గోశాలకు తరలించి వాటి సంరక్షణ బాధ్యతలను నగరపాలక సంస్థ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. పశువులను యజమానులు వాళ్ల ప్రాంగణాలలోనే ఉంచుకోవాలని, రోడ్లపై వదిలితే తప్పనిసరిగా వాటిని గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. పశువుల యజమానులకు గతంలోనే హెచ్చరిక నోటీసులు జారీ చేసి ఉన్నామని, మీడియా మాధ్యమాల ద్వారా ప్రకటించి ఉన్నామని తెలిపారు.