న్యూఢిల్లీ : ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన మాజీ నేవీ అధికారులకు ఊరట లభించింది. జైలు శిక్షపై అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల సమయం ఇచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి (ఎంఇఎ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం పేర్కొన్నారు. మరణ శిక్ష రద్దు చేసిన తేదీ నుండి ఈ 60 రోజుల గడువు ప్రారంభమైందని తెలిపారు. గతేడాది డిసెంబర్ 28న, ఖతార్లోని అప్పీల్ కోర్టు వారి మరణశిక్షను రద్దు చేసి, జైలు శిక్షగా మారుస్తున్నట్లు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
”ఎనిమిది మంది భారతీయుల పిటిషన్పై డిసెంబర్ 28న అక్కడి కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పునిచ్చింది. వారి మరణశిక్ష రద్దు చేసి జైలు శిక్షగా మార్చింది. భారత న్యాయ బృందానికి తీర్పు కాపీ అందింది. మరణశిక్షను రద్దు చేసిన విషయాన్ని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. మిగిలిన అంశాలు చెప్పలేం. ఈ సందర్భంగా కోర్టు భారత న్యాయ సహాయ బృందాలకు జైలు శిక్షపై అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువు ఇచ్చింది. ఈ అప్పీలు ఖతార్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట విచారణకు వస్తుంది” అని వెల్లడించారు.