మార్కింగ్ వాక్ చేస్తున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్
నగరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కులు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్న నేపఝత్యంలో తాము అధికారంలోకి రాగానే పీటీసీ తరహాలో భారీ మైదానాన్ని ఏర్పాటు చేస్తామని అనంతపురం అర్బన్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ హామీ ఇచ్చారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పిటిసి మైదానంలో కాఫీ విత్ మార్నింగ్ వాకర్స్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఉదయం స్టేడియం చేరుకుని అక్కడ వాకర్స్తో ఉత్సాహంగా వాకింగ్ చేస్తూ ముచ్చటించారు. వాకర్స్ అసోసియేషన్ నాయకులను కలిసి అక్కడున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యువకులతో వాలీ బాల్ ఆడుతూ అందరినీ ఉత్సాహ పరిచారు. యువకులను కలిసి వారి చదువులు ఉద్యోగ అవకాశాల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ పిటిసి మైదానంలో కనీసం వాకింగ్ ట్రాక్ లేదన్నారు. టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఎలాంటి అభివద్ధి పిటిసిలో కనిపించలేదన్నారు. మార్నింగ్ వాకర్స్ తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటిని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నారు. ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు కనుమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జయరామ్నాయుడు, మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి, పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కూచిహరి, గంగారాం, ఎర్రగుంట సురేష్, చెక్కా నాగేంద్ర పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేను పక్కా లోకల్
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదరౌతున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. నగరంలోని పలు డివిజన్లలో పర్యటిస్తు ఇంటింటికీ వెళ్లి బాబు షురిటీ-భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్-6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. పేదలకు, చిరు వ్యాపారులకు, ఇతర వేతన జీవులకు తమ మేనిఫెస్టోలోని అంశాలను వివరించి వారి భవిష్యత్తుకు భరోసానిస్తున్నారు. ఈ సందర్భంగా తనను నాన్ లోకల్ అంటూ అధికార పార్టీ నేతలకు విమర్శలను తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తాను పక్కాలోకల్ అని తన స్వగ్రామం నగరానికి కూతవేటు దూరంలోనే ఉందన్నారు. పదేళ్లుగా తాను అనంతపురంలోని రాంనగర్లో నివాసం ఉంటున్నానని స్పష్టం చేశారు. వైసీపీ నేతలే వలస పక్షులని, అనంతపురం ఎంపీ అభ్యర్థి నాన్ లోకల్ అని, హిందూపురం ఎంపీ అభ్యర్థి కర్ణాటక నుంచి వలస వచ్చిన సంగతి మర్చిపోయారా అంటూ ఎద్దేవా చేశారు.