ED arrest: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఐఎఎస్‌ అధికారి అరెస్ట్‌

రాయ్‌పూర్  :  రూ. 200 కోట్ల లిక్కర్‌స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మాజీ ఐఎఎస్‌అధికారిని అరెస్ట్‌ చేసింది. మాజీ ఐఎఎస్‌ అధికారి అనిల్‌ తుతేజా, ఆయన కుమారుడు యష్‌ తుతేజాలను ఇడి అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఫెడరల్‌ ఏజెన్సీ 2003 బ్యాచ్‌ అధికారిని శనివారం రారుపూర్‌లోని ఆర్థిక నేరాల విభాగం (ఇడబ్ల్యుఎస్‌) అవినీతి నిరోధక బ్యూరో కార్యాలయం (ఎసిబి) నుండి అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) నిబంధనల ప్రకారం ఐఎఎస్‌ అధికారిని అదుపులోకి తీసుకున్నారని.. అతనిని రిమాండ్‌ కోరుతూ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఆ అధికారి గతేడాది సర్వీసు నుంచి రిటైరయ్యారు. ఆయన చివరగా చత్తీస్‌గఢ్‌ పరిశ్రమ మరియు వాణిజ్య శాఖలో జాయింట్‌ సెక్రటరీగా నియమించబడ్డారు.

ఆదాయ పన్ను శాఖ ఫిర్యాదు ఆధారంగా గతంలో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఇడి కొత్త మనీలాండరింగ్‌ కేసును దాఖలు చేసింది. ఈ కేసులో నేరపూరిత ఆదాయం రూ.2,161 కోట్లుగా ఇడి అంచనా వేసింది.

ఛత్తీస్‌గఢ్‌లో విక్రయించిన ప్రతి మద్యం బాటిల్‌ నుండి ”చట్టవిరుద్ధంగా ” నగదు వసూలు చేశారని, రారు పూర్‌ మేయర్‌ ఎజాబ్‌ దేభర్‌ అన్నయ్య అన్వర్‌ ధేబర్‌ నేతృత్వంలో లిక్కర్‌ సిండికేట్‌ ద్వారా రూ. 2,000 కోట్ల అవినీతి, మనీలాండరింగ్‌ జరిగిందని ఇడి ఆరోపించింది.

➡️