ధర్మవరంలో డ్రైవర్‌ దారుణహత్య

Apr 16,2024 21:57 #Hatya, #sri sathya sai district
  • ఆటో కిరాయి విషయంలో ఘర్షణ

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణ రైల్వే స్టేషన్‌ సమీపంలో డ్రైవర్‌ దారుణహత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన రెండవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధర్మవరం పట్టణం తారకరామాపురానికి చెందిన శ్రీనివాసరెడ్డి (55) కారు డ్రైవర్‌గా వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ నెల 14న మదనపల్లిలో ఉన్న తన కుమారుడు వద్దకు వెళ్లారు. తిరిగి 15న రాత్రి మదనపల్లి నుంచి రైలులో బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున ధర్మవరం చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో కిరాయి మాట్లాడే క్రమంలో ఆటో డ్రైవర్‌ లోకేంద్రతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో లోకేంద్ర, అతని మిత్రుడు విష్ణువర్ధన్‌ కలిసి రాళ్లు, కర్రలతో పట్టణంలోని అంకాలమ్మ గుడి వద్ద శ్రీనివాసరెడ్డిపై దాడి చేశారు. దీంతో అతను మరణించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులిద్దరిని పట్టణంలోని కెహెచ్‌ డిగ్రీ కళాశాల వద్ద అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రాళ్లు, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు సిఐ అశోక్‌కుమార్‌ తెలియజేశారు.

➡️