ప్రజాశక్తి – పెద్దాపురం
జన విజ్ఞాన వేదిక, మద్యం, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కుమ్మరి వీధిలోని సంత మార్కెట్ పరిసరాల్లో ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ కన్వీనర్ ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. మద్యపాన రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కువ మంది యువత మద్యంకు బానిసలయ్యే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని యువతను మద్యం భారీ నుంచి కాపాడేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంటి, తరుణ్, ప్రసాద్ పాల్గొన్నారు.