ప్రజాశక్తి-శ్రీకాకుళం : రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలిలో జరిగిన వైయస్సార్ ఆసరా సంబరాల్లో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని ఇక విశ్రాంతి తీసుకుంటానని సీఎం జగన్ కు చెప్పానన్నారు. రాజకీయాల్లో విసిగిపోయానని పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని జగన్ కు ఇప్పటికే స్పష్టం చేశానన్నారు. తనకు పోటీ చేయడం ఇష్టం లేకపోయినా జగన్ మాత్రం అంగీకరించడం లేదన్నారు. పార్టీ కోసం ఈ ఒక్కసారి పోటీ చేయాలని సీఎం తనకు చెప్పారని ధర్మాన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నదానిపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు.