- మురళి సహా తొమ్మిది మందిని అరెస్టు చేసి ఆస్పత్రికి తరలింపు
- కొత్తగా ఐదుగురు నిరవధిక నిరాహార దీక్ష
ప్రజాశక్తి- తిరుపతి : నిరవధిక నిరాహార దీక్షకు దిగిన సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళితో సహా తొమ్మిది మంది అటవీ కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రుయా ఆస్పత్రికి తరలించారు. తమను పర్మినెంట్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టిటిడి అటవీ కార్మికులు 38 నెలలుగా రిలే దీక్షలు చేస్తున్నా టిటిడి న్యాయం చేయకపోవడంతో గత శనివారం నుంచి మురళితో సహా తొమ్మిది మంది కార్మికులు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు పోలీసులు వచ్చారు. దీక్షల్లో కూర్చున్న వారిని బలవంతంగా అరెస్టు చేసి రుయా ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్యం క్షీణిస్తోందంటూ రుయా వైద్యుల బృందం ఇచ్చిన నివేదిక పేరుతో దీక్షలను భగం చేయడానికి ఈ విధంగా చేశారు. పోలీసుల చర్యలను కార్మికులు నిరసించారు. ఈ శిబిరంలో కొత్తగా ఐదుగురు కార్మికులు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.